Share News

దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు

ABN , Publish Date - May 13 , 2026 | 02:35 PM

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై సీఎం స్పందించారు.

దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు
AP CM Chandra babu Naidu

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై సీఎం స్పందించారు. నిడమర్రులో సీఎం చంద్రబాబు ఈరోజు (బుధవారం) పర్యటించారు. కిమ్స్ ఆస్పత్రికి భూమి పూజ చేశారు. బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అమలాపురం ఎంపీ హరీశ్ బాలయోగి, మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.


కార్యాచరణ ప్రకటిస్తాం..

ప్రధాని ప్రకటించిన 8 పొదుపు సూచనలు పాటించాలని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు… ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 8 సూచనలను మనం పాటించాలని.. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని దిశానిర్దేశం చేశారు. పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని.. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రియాలిటీ అని.. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుందని.. దీనిని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయని.. దేశం మొత్తం దుబారాను తగ్గించాలని మార్గనిర్దేశం చేశారు.


కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించాలి..

పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లటం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్‌గా మారిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని.. సెక్యూరిటీని కూడా కుదించుకోవాలని సూచించారు. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని ప్రధాని మోదీ సూచించారని.. దీనిని కూడా మనం పాటిద్దామని పిలుపునిచ్చారు. మన దేశంలో, రాష్ట్రంలోనూ మంచి పర్యాటక ప్రాంతాలున్నాయని వివరించారు. ప్రజలు విదేశాలకు వెళ్లడం కంటే మన పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ‘నాదేశం- నా బాధ్యత’ అనే ఆలోచనను ప్రజలంతా ఆచరించాలని అన్నారు. రెండు రోజుల్లో ఈ విషయంపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. బంగారం కొనడాన్ని కూడా తగ్గించాలని ప్రధాని చెప్పారని ప్రస్తావించారు. దీనిపైనా ప్రజలు ఆలోచన చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్.. పెదపాడుకు కొత్త స్కూల్ భవనం

అగ్నిమాపక శాఖలో ఖాళీల భర్తీకి హోంమంత్రి ఆదేశాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 02:59 PM