Share News

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 10 , 2026 | 07:50 PM

ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

ఢిల్లీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు (AP CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. దేశం గర్వించేలా చేయడంతో పాటు, ప్రపంచదేశాల్లో భారతదేశ గౌరవం పెంచేలా ప్రధాని మోదీ విశేష కృషి చేశారని కొనియాడారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మద్దతుగా ప్రధాని నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయని... కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం కాదని... దేశం కోసం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అధికారం కోసం కాదని... జాతీయ లక్ష్యసాధన కోసం ఎన్డీఏ ప్రయాణం సాగుతోందని తెలిపారు. దీనికి రాష్ట్రాల్లో వరుసగా ఎన్డీఏ సాధిస్తున్న విజయాలే సాక్ష్యమని చెప్పుకొచ్చారు.


ఆ గెలుపు ఎన్డీఏపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం

బీహార్‌లో 243 స్థానాల్లో 202 స్థానాల్లో గెలుపు ఎన్డీఏపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసోం గెలుపు మరోసారి విశ్వాసం వ్యక్తం చేసిందని.. పుదుచ్చేరి విజయం కూడా మరోసారి ఎన్డీఏకి మద్దతు తెలిపిందని ప్రస్తావించారు. ఇవి కేవలం ఎన్నికల ఫలితాలు కావని... సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని అభివర్ణించారు. ఒకప్పుడు ‘ఈరోజు పశ్చిమబెంగాల్ ఆలోచిస్తే... రేపు భారత్ ఆలోచిస్తుంది’ అనే పేరు ఉండేదని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం తర్వాత దశాబ్దాల పాటు పశ్చిమబెంగాల్ అభివృద్ధి ప్రధాన స్రవంతికి దూరమైందని తెలిపారు. దేశ సంస్కరణలు, అభివృద్ధి వైపు సాగితే... పశ్చిమబెంగాల్ పాత రాజకీయాల్లోనే చిక్కుకుపోయిందని అన్నారు. తాజా మార్పుతో పశ్చిమబెంగాల్ దిశ మళ్లీ అభివృద్ధి వైపు సాగనుందని వివరించారు.


వికాస్ బీ... విరాసత్ బీ నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకం..

మారుతున్న భారత ఆకాంక్షలకు అనుగుణంగా బెంగాల్ అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. బెంగాల్ మళ్లీ దేశానికి మార్గదర్శకంగా నిలిచే రోజు దగ్గరలోనే ఉందని ప్రస్తావించారు. భారతీయత పునరుజ్జీవం పొందడం గత 12 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద మార్పు అని పేర్కొన్నారు. వికాస్ బీ... విరాసత్ బీ నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకమని ఉద్ఘాటించారు. ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పరిపాలన, ఆవిష్కరణల సమన్వయమే నూతన భారత్ బలమని తెలిపారు. 21వ శతాబ్దానికి భారత్ అందించే గొప్ప సందేశం ఇదేనని.. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ దేశానికి ఉన్న అడ్డంకులు తొలగించి, స్పష్టమైన విధానాలతో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.


అత్యుత్తమ రాజకీయవేత్తల్లో మోదీ ఒకరు..

వ్యవస్థను పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండేలా ప్రధాని తీర్చిదిద్దుతున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ప్రతి భారతీయుడి మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో మోదీ ఒకరని ఉద్ఘాటించారు. ప్రపంచ మార్పులో భారత్ భాగస్వామినే కాదని... దిశానిర్దేశం చేసే దేశంగా భారత్ ఎదుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 08:00 PM