మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ
ABN , Publish Date - May 21 , 2026 | 04:27 PM
తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు.
అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం ఈరోజు (గురువారం) మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం, పొలిట్బ్యూరో నియామకం తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి వర్చువల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్కు సంబంధించిన ఒక తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
మహిళా సంక్షేమంపై ఫోకస్..
2026 మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్తో నిర్వహించాలని పొలిట్బ్యూరో నిర్ణయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, మహిళల భాగస్వామ్యంతో అమలు చేసిన కార్యక్రమాలను మహానాడు వేదికగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రతి సంక్షేమ పథకాన్ని రూపొందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై మహానాడులో సమగ్ర చర్చ జరగాలని దిశానిర్దేశం చేశారు.
పండుగ వాతావరణంలో మహానాడు: సీఎం చంద్రబాబు
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహానాడును నిర్వహించాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమానికి రెండు రోజుల ముందే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరినీ మహానాడులో భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహానాడు ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలో దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాలకు నివాళులు అర్పించి కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ఎన్టీఆర్ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన రాజకీయ, సామాజిక మార్పులను మహానాడు వేదికగా ప్రదర్శించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.
గొడ్డలి పార్టీ కుట్రలపై చర్చించాలి..
పొలిట్ బ్యూరో సమావేశంలో వైసీపీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్న ‘గొడ్డలి పార్టీ కుట్రలను’ మహానాడు వేదికగా ప్రజల ముందుంచాలని నిర్ణయించారు. అలాగే ‘నా దేశం-నా బాధ్యత’ పేరుతో పొదుపు చర్యలు, సామాజిక బాధ్యతలపై ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు
నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్
దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్
దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News