రేకులషెడ్డు బడికి మోక్షం!
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:18 AM
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆ బడికి వెలుగులు ప్రసరించనున్నాయి! విద్యార్థులకు వసతి సమస్య తీరి పక్కాభవనాలు రానున్నాయి. పోలవరం జిల్లా నూతనంగా ఏర్పడిన గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని మెట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో 51మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నప్పటికీ, పక్కా భవనం లేక రేకుల షెడ్డులోనే విద్యాభ్యాసం కొనసాగుతోంది.
మెట్టగూడెం పాఠశాలకు పక్కా భవనాలు
రూ.56.80 లక్షలు మంజూరు చేసిన మంత్రి లోకేశ్
కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు
మోతుగూడెం, జూలై 29(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆ బడికి వెలుగులు ప్రసరించనున్నాయి! విద్యార్థులకు వసతి సమస్య తీరి పక్కాభవనాలు రానున్నాయి. పోలవరం జిల్లా నూతనంగా ఏర్పడిన గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని మెట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో 51మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నప్పటికీ, పక్కా భవనం లేక రేకుల షెడ్డులోనే విద్యాభ్యాసం కొనసాగుతోంది. వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై ‘రేకుల షెడ్డులోనే అక్షర తపస్సు’ శీర్షికన ఈనెల 20వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన వెంటనే స్పందించి శాశ్వత భవన నిర్మాణం కోసం రూ.56.80లక్షలు మంజూరు చేశారు. మంజూరైన నిధుల్లో రెండు పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.29.30 లక్షలు (రూ.14.65లక్షల చొప్పున), తాగునీటి సౌకర్యానికి రూ.3.40 లక్షలు, బాలుర మరుగుదొడ్లకు రూ.3.80 లక్షలు, బాలికల మరుగుదొడ్లకు రూ.3.80 లక్షలు, పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.11.50 లక్షలు, వంట షెడ్డు నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. మారుమూల గిరిజన ప్రాంతంలోని విద్యార్థుల సమస్యను గుర్తించి నిధులు మంజూరు చేసిన మంత్రి లోకేశ్కు, సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’కి గ్రామస్థులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో సమగ్ర శిక్ష డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గడ్డం సురేశ్ కుమార్, సైట్ ఇంజనీర్లు వి.రమణమూర్తి, డి.సాయిచంద్ర మెట్టగూడెం గ్రామాన్ని సందర్శించి స్థలాన్ని పరిశీలించారు. త్వరలో పాఠశాల భవన నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలిపారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News