హిందూపురంలో.. ఎందుకిలా జరుగుతోంది?
ABN , Publish Date - May 05 , 2026 | 11:04 AM
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో ఇటీవల నాలుగు హత్యలు జరిగాయి.
హెచ్చుమీరుతున్న దారుణాలు
వరుసగా హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు
భయాందోళన చెందుతున్న ప్రజలు
హిందూపురం(అనంతపురం): హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో ఇటీవల నాలుగు హత్యలు జరిగాయి. ఇందులో ఒకటి, రెండు హత్యలు చిన్నపాటి ఘర్షణకే జరిగాయి.
నాలుగు రోజుల క్రితం ఆటోలో ఎక్కిన ఓ మహిళనుంచి పట్టణ పరిధి దాటాక నగలు, నగదు దోచుకున్న ఘటన చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై స్పందించడంతో సొమ్మును రికవరీ చేయగలిగారు.
తాజాగా ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి చాక్లెట్ ఇచ్చి బైక్పై తీసుకెళ్లాడు. అయితే ముళ్లపొదలవైపు తీసుకెళ్తున్న సమయంలో చిన్నారి కేకలు వేయడంతో అక్కడున్నవారు గమనించి వెంటనే రక్షించారు.
గత వైసీపీ హయాంలో హిందూపురం నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటికి అడ్డుకట్ట పడింది. అయితే ఏమైందో ఏమో ఇళ్లీ కొద్దికాలంగా ఇలాంటి దారుణాలు అధికమవుతున్నాయి. హిందూపురం సబ్డివిజన్లో కొంతమంది అసాంఘిక శక్తులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన దారుణాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జిల్లా ఎస్పీ హిందూపురంపై ఎంత ఫోకస్ పెట్టినా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు ఆగడం లేదన్నది నగ్నసత్యంగా నిలుస్తోంది. అయితే ఎందుకిలా జరుగుతుందన్నది పోలీసులకే ఎరుక.
హెచ్చుమీరుతున్న అసాంఘిక శక్తులు
ఓ వైపు పోలీసులు జరిగిన నేరాలపై ఎప్పటికప్పుడు స్పందించి నేరస్తులను పట్టుకుంటున్నారు. అయినా వారంలో ఏదోఒక నేరం జరగడం ఆనవాయితీగా మారిందన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. దీనికితోడు అన్ని పోలీస్స్టేషన్లకు కొత్త సిబ్బంది వచ్చారు. వారు పట్టణంపై పట్టు సాధించాలంటే మరికొన్నిరోజులు పడుతుంది. పేకాట, మట్కా, పట్టణంలో విపరీతంగా జరుగుతున్నది. పోలీసులు వాటి నిర్వాహకులను పట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా కోర్టులో హాజరుపరుస్తున్నారు. దీనివల్ల పోలీసులు ఇంతకన్నా ఏమీ చేయలేరులే అన్న ధైర్యంతో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నారు. వీరితోపాటు ఇతర ప్రాంతానికి చెందిన వారు వచ్చి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. తరచూ కారిడాన్ సర్చ్ పేరుతో తనిఖీలు చేస్తున్నా కొంతమంది నేరస్థులు అసాంఘిక కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు.
జనం బెంబేలు
ఇటీవల హిందూపురం ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మహిళలు బయటికి వెళ్తే ఎక్కడ ఆభరణాలు దోచుకెళ్తారోనన్న భయం. చిన్న పిల్లలను బయటకు పంపాలంటే జంకే పరిస్థితి. మరోవైపు నగలు, నగదు వేసుకుని వెళ్లాలంటే ఎక్కడ దోపిడీ జరుగుతుందోనన్న బెంగ పట్టుకుంటోంది. ఏదిఏమైనా అసాంఘిక శక్తులను కూకటేళ్లతో పెకలించి జరుగుతున్న నేరాలకు చెక్ పెడితేతప్ప ప్రజల్లో భయాందోళన తగ్గదన్నది నగ్నసత్యం.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..
తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి
Read Latest Telangana News and National News