Somireddy slams Jagan: అందుకే గూగుల్పై జగన్ అండ్ కోకి కోపం.. సోమిరెడ్డి సెటైర్లు
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:18 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్పై జగన్ మోహన్ రెడ్డి, ఆయన బ్యాచ్కు అంత కడుపు మంట ఎందుకని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి.
నెల్లూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ (Google)పై జగన్ మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కు అంత కడుపు మంట ఎందుకని ఫైర్ అయ్యారు. విశాఖకు గూగుల్ రావడాన్ని వైసీపీ తప్పా అందరూ స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) నెల్లూరు వేదికగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గూగుల్లో 6093 అని కొడితే జగన్ రెడ్డి జైలు జీవితం మొత్తం బయటకొస్తోందని సెటైర్లు గుప్పించారు సోమిరెడ్డి.
గూగుల్ టేకవుట్ టెక్నాలజీ ద్వారా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని సీబీఐ గుర్తించిందని తెలిపారు. జగన్ రెడ్డి అండ్ కో గుట్టు రట్టు చేసిందని గూగుల్పై కోపం పెంచుకొని ఉంటారని విమర్శించారు. రాజా ఆఫ్ కరప్షన్ అని కొట్టినా జగన్ చరిత్రనే గూగుల్ చూపిస్తోందని ఎద్దేవా చేశారు. తండ్రిని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోపిడీ చేసిన అవినీతి చరిత్ర బయటకు వస్తోందని.. అందుకనే గూగుల్ అంటేనే కడుపుమంటతో జగన్ అండ్ కో రగిలిపోతున్నారని దెప్పిపొడిచారు. రూ.1.33లక్షల కోట్లతో గూగుల్ ఏపీకి రావడం చాలా గొప్ప విషయమని ఉద్ఘాటించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
మంత్రి నారా లోకేష్ కృషితోనే కొత్త రాష్ట్రమైన ఏపీ ఈ ఘనతను సాధించిందని అభివర్ణించారు. గూగుల్ ఏపీలోకి అడుగు పెట్టడాన్ని వైసీపీ, జగన్ రెడ్డితోపాటు సాక్షి కూడా జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఏపీకి ప్రతిష్టాత్మకమైన సంస్థ వస్తుంటే సాక్షి మీడియాలో ఒక్క వార్త కూాడా లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంత కడుపుమంటతో రగిలిపోయే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పుకోవాల్సి వచ్చినందుకు ఏపీ ప్రజలు చాలా బాధపడుతున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి మళ్లీ ఏపీకి సీఎం అవుతానని కలలు కనడం మరింత దుర్మార్గమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్షేపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News