Cyclone Montha: దూస్తుకొస్తున్న మొంథా తుపాను.. అధికారులు అలర్ట్
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:54 PM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపానుగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలిందని వెల్లడించారు ప్రఖర్ జైన్.
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాను (Cyclone Montha)గా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలిందని వెల్లడించారు. ప్రస్తుతానికి మచిలీపట్నాని (Machilipatnam)కి 110 కిలోమీటర్లు, కాకినాడ (Kakinada)కి 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వివరించారు. ఈ మేరకు ప్రఖర్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈరోజు (మంగళవారం) రాత్రికి కాకినాడ - మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను ఏపీ తీరానికి దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు ప్రఖర్ జైన్.
తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు
తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై అధికారులు ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను ఇవాళ రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తుపాను ప్రభావిత జిల్లాల కంటే ముందుగానే ఏదైనా సురక్షిత ప్రాంతంలో వాహనాలు నిలిపివేయాలని వాహనదారులకి సూచించారు. తుపాను నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.
ఇవి కూడా చదవండి...
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
Read Latest AP News And Telugu News