ఆ పనుల్లో నేనెక్కడా అవినీతి చేయలేదు: సీతక్క
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:01 PM
మేడారం సమ్మక్క- సారక్క అమ్మవార్ల గద్దెల పున: నిర్మాణ పనుల్లో ఎక్కడ అవినీతి జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గద్దెల పున: నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని.. ఆధారాలు ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
ములుగు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క- సారక్క అమ్మవార్ల గద్దెల పున: నిర్మాణ పనుల్లో ఎక్కడ అవినీతి జరగలేదని మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. గద్దెల పున: నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని.. ఆధారాలు ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అవసరమైతే సీబీఐ విచారణ జరపాలని సూచించారు.ఈరోజు(శనివారం) ములుగులో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పర్యటించారు. మహేశ్ గౌడ్కు గట్టమ్మ దేవాలయం వద్ద మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గట్టమ్మ దేవాలయంలో మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గట్టమ్మ దేవాలయం నుంచి భారీ బైక్ ర్యాలీగా ములుగు పట్టణ కేంద్రానికి నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు.
నాపై తప్పుడు ప్రచారం చేశారు..
ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు రూ.వందల కోట్లు ఖర్చుచేశారని, తనపై తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను ప్రలోభాలకు గురిచేశారని.. అయినా తాను వారికి లొంగలేదని చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో అవినీతి జరిగిందని... అవినీతి సీతక్క అంటున్నారని.. జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. తానెక్కడా అవినీతి చేయలేదని స్పష్టం చేశారు. రూ.11,650లకు ఫోన్లు కొంటే.. రూ.14000వేలని ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
హైదరాబాద్లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News