ఆధారాలతో రండి మేము చర్చకు సిద్ధం.. మంత్రి పొన్నం సవాల్
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:18 AM
గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం గన్పార్క్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, జులై 2 (ఆంధ్రజ్యోతి): గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం) గన్పార్క్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి అసెంబ్లీలో హరీశ్రావు చర్చకు రావాలని సవాల్ చేశారు. తాము ప్రెస్క్లబ్కు కూడా వస్తామని.. కానీ రాజ్యాంగంలో ఎన్నికైన వ్యక్తులు చర్చకు రావాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈరోజు 12 గంటల్లోగా గన్పార్క్ దగ్గరకు రావాలని అన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే తాము ఎక్కడైనా చర్చకు వస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో లాగా కడప కాంట్రాక్టర్లకు తమ ప్రభుత్వం టెండర్లు ఇవ్వలేదని తేల్చిచెప్పారు. తాము పారదర్శకంగా గురుకులాల టెండర్లు జరగాలని చూశామని పేర్కొన్నారు.
అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తాం..
‘గురుకులాల టెండర్ కోసం ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ మాకేమైనా చుట్టమా?. టెండర్లలో అసలు అవినీతి జరిగింది రూ.2 వేల కోట్లా..? రూ.5వేల కోట్లా..?. బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆధారాలతో రండి మేము చర్చకు సిద్ధం. మేము అవినీతి చేసినట్లు నిరూపిస్తే.. ముగ్గురు మంత్రులం గన్పార్క్ దగ్గర ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాం. మేము పిరికివాళ్లం కాదు. ఎవరితో పడితే వారితో చర్చకు రాము. మాజీ సీఎం కేసీఆర్ గులాబీ పార్టీ నేతలను అదుపులో పెట్టుకోవాలి. లేదంటే కేసీఆర్కు చెడ్డపేరు వస్తుంది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన అవినీతి చేసి ఉండొచ్చు.. ఆర్ఎస్పీకి మేం సమాధానం చెప్పం. తమ జోలికి వచ్చి ప్రవీణ్ ఇబ్బంది పడొద్దు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హైటెక్ డ్రోన్ పోలీసింగ్.. గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News