Share News

కాంగ్రెస్‌లో హైడ్రామా.. కొండా సురేఖ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణమిదేనా..?

ABN , Publish Date - Sep 01 , 2026 | 04:12 PM

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో హైడ్రామా.. కొండా సురేఖ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణమిదేనా..?
Konda Surekha

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు వరుసగా ఈరోజు (మంగళవారం) ఢిల్లీ బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. సురేఖతో పాటు ఢిల్లీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా వెళ్లారు.


మంత్రి పదవి నుంచి తప్పిస్తారా..?

అయితే, మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయింది. ఈ విషయంపై అధిష్ఠానం గరంగరంగా ఉంది. ఈ క్రమంలోనే సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపురావడం ఉత్కంఠగా మారింది. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జునఖర్గే అపాయింట్‌మెంట్‌ను ఆమె కోరారు.


అగ్రనేతలతో భేటీ కానున్న కొండా సురేఖ ..

అలాగే, కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్.. కొండా సురేఖకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కీలక భేటీలో ఆమె పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖను బర్తరఫ్ చేసే అంశంపైనే ప్రధానంగా ఈ చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో మంత్రి కొండా సురేఖ భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆమె మంత్రివర్గంలో కొనసాగుతారా..? లేదా అనే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సురేఖ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ రాజకీయాల్లోనూ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.


ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

అలాగే, ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం అధిష్ఠానం పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.


మల్లికార్జున ఖర్గేతో గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గేను.. గడ్డం ప్రసాద్ కలిశారు. మంత్రివర్గంలో స్థానం కోరుతూ ఖర్గేకు గడ్డం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.


కేసీ వేణుగోపాల్‌‌‌ను కలవనున్న రాజగోపాల్‌రెడ్డి

అలాగే, కేసీ వేణుగోపాల్‌ను.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా కలుస్తారని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఢిల్లీకి ఆశావాహులు వరుస కడుతున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హై కమాండ్ హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. తనకు ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.


ఢిల్లీకి మల్‌రెడ్డి రంగారెడ్డి..

అలాగే, ఢిల్లీకి మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా చేరుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో రంగారెడ్డి నుంచి మంత్రి పదవిని ఆయన ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గడ్డం ప్రసాద్ ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మల్‌రెడ్డి రంగారెడ్డి అలర్ట్ అయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 05:54 PM