Share News

నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Mar 16 , 2026 | 08:31 PM

నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్‌రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్‌రెడ్డిని ఆదేశించింది.

 నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం
Prathyusha Case

హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష(Prathyusha) మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ్ రెడ్డి (Siddharth Reddy) 24 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. సుప్రీంకోర్టు తుది తీర్పు మేరకు ఆయన హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో (Nampally Court) లొంగిపోయాడు. ఈ కేసు రెండు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తుది తీర్పుతో కేసులో మరో కీలక మలుపు తిరిగింది.


అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి

నటి మరణ ఘటన తర్వాత సిద్ధార్థ్ రెడ్డి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చాలాకాలంగా విదేశాల్లో ఉన్న ఆయన, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భారత్‌కు వచ్చి కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని చెప్పడంతో, ఆ గడువు లోపే నాంపల్లి కోర్టుకు వచ్చి సమర్పణ చేశాడు.


2002లో ఘటన..

ఈ ఘటన 2002 ఫిబ్రవరి 23వ తేదీన జరిగింది. అప్పట్లో నటి ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరూ కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రత్యూష ప్రాణాలు కోల్పోయింది. అయితే సిద్ధార్థ్ రెడ్డి చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ సంఘటన ఆ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది.


ప్రత్యూష తల్లి న్యాయపోరాటం..

ప్రత్యూష మృతి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తల్లి ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, హత్య జరిగి ఉండొచ్చని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె తల్లి న్యాయపోరాటం ప్రారంభించారు. కేసును కోర్టులో కొనసాగిస్తూ నిజం బయటకు రావాలని పట్టుదలగా పోరాడారు.


ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణ..

పోలీసుల దర్యాప్తు అనంతరం సిద్ధార్థ్‌రెడ్డిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. కేసు ట్రయల్ కోర్టులో విచారణకు వచ్చింది. ట్రయల్ కోర్టు విచారణలో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.


హైకోర్టు శిక్ష తగ్గింపు

ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు (Telangana High Court) శిక్షను కొంత తగ్గించింది. ఐదేళ్ల జైలు శిక్షను రెండు సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.


సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ..

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఈ కేసు చాలాకాలం పాటు సుప్రీంకోర్టులో విచారణలో కొనసాగింది. చివరకు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సిద్ధార్థ్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.


నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశం..

తుది తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు సిద్ధార్థ్‌రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఆయన హైదరాబాద్‌కు వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు.


24 ఏళ్ల తర్వాత మరోసారి చర్చలో కేసు..

దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నటి ప్రత్యూష మరణం అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన ఘటనగా గుర్తింపు పొందింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తుది తీర్పుతో ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 08:40 PM