ఆ జిల్లాలో దారుణం.. అచ్చం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఘటన రిపీట్
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:42 PM
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ప్రాంతంలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిన యువతిపై ఒక యువకుడు ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ప్రాంతంలో సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఓ యువకుడు, యువతికి ప్రాణాంతకమైన HIV (ఎయిడ్స్) సోకిన రక్తాన్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కించాడు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో జరిగిన ఈ పైశాచిక ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే.?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మనోహర్, బాధితురాలిని కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. మనోహర్కు HIV(ఎయిడ్స్) పాజిటివ్ ఉందని తెలియడంతో ఆ యువతి అతడితో పెళ్లికి నిరాకరించింది. తన ప్రాణాలను పణంగాపెట్టి పెళ్లి చేసుకోలేనని స్పష్టం చేసింది. తన వ్యాధి గురించి తెలిసి పెళ్లికి నో చెప్పిందనే కోపంతో మనోహర్ ఉన్మాదిలా ప్రవర్తించాడు. ‘నేను ఎలాగూ చనిపోతాను.. నువ్వు కూడా నాతోనే రావాలి’ అనే వికృత ఆలోచనతో, తన రక్తాన్ని లేదా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల రక్తాన్ని ఇంజక్షన్ ద్వారా ఆ యువతి శరీరంలోకి ఎక్కించాడు.
పోలీసుల చర్యలు..
బాధితురాలి ఫిర్యాదుతో ఘట్కేసర్ పోలీసులు వెంటనే స్పందించారు. మనోహర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రక్తాన్ని అతను ఎక్కడి నుంచి సేకరించాడు? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు ప్రయోగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని స్థానికులు ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్
గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం
టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి
Read Latest Telangana News And AP News And International News And Telugu News