ఘోర ప్రమాదం: మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. ఒకరికి సీరియస్
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:11 PM
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మాగంటి గోపినాథ్ కుమార్తెలకు గాయాలయ్యాయి. శంషాబాద్ నుంచి వస్తుండగా జరిగిన ఈ ఘటనలో పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జూబ్లీహిల్స్ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు (Maganti Gopinath Daughters) గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా, రెండో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందగానే నార్సింగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
డీసీఎంను ఢీకొన్న కారు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న TSPA (తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ) సమీపంలో నిన్న(ఆదివారం) అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా నార్సింగి సమీపంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై ముందు వెళ్తున్న ఒక డీసీఎం వాహనాన్ని మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ఉన్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ముగ్గురు ఉన్నారు. అందులో మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
క్షతగాత్రుల పరిస్థితి..
ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రెండో కుమార్తె స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను వెంటనే గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర వైద్య చికిత్స కొనసాగుతోంది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు..
నార్సింగి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కారు అతివేగం కారణంగానే నియంత్రణ కోల్పోయి డీసీఎంను ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
నేను ఇక కాంగ్రెస్లో ఉండలేను.. జీవన్రెడ్డి సంచలన ప్రకటన
బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
Read Latest Telangana News And AP News And International News And Telugu News