పుష్పక్ బస్సుల్లో ఎయిర్పోర్టుకు తగ్గిన ప్రయాణికులు
ABN , Publish Date - Sep 18 , 2026 | 08:55 AM
రాజీవ్గాంధీ ఎయిర్పోర్టుకు ఆర్టీసీ పుష్పక్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య గతేడాదితో పోల్చితే భారీగా తగ్గింది.
హైదరాబాద్ సిటీ: రాజీవ్గాంధీ ఎయిర్పోర్టుకు ఆర్టీసీ పుష్పక్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య గతేడాదితో పోల్చితే భారీగా తగ్గింది. గతేడాది ఆగస్టులో మియాపూర్ ఎక్స్రోడ్ నుంచి రాజీవ్గాంధీ ఎయిర్పోర్టుకు ఆర్టీసీ నడిపిన బస్సుల్లో 92 శాతం ప్రయాణికుల ఆక్యుపెన్సీ నమోదవగా ఈ ఏడాది ఆగస్టులో 53 శాతానికి పడిపోయింది. ఉన్నత చదువులకోసం ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, ఇతరదేశాల నుంచి వచ్చేవారి సంఖ్య తగ్గడంతో ఆ ఎఫెక్ట్ ఎయిర్పోర్టు బస్సులపై పడింది.
గతంతో పోల్చితే కెనడా, యూఎస్, యూకే దేశాలు స్టూడెంట్ వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ 57 పుష్పక్ బస్సులను 5 రూట్లలో ప్రతీరోజు 432 ట్రిప్పులు నడుపుతుండగా రోజూ 8,700 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సుల కంటే, వచ్చే బస్సుల్లోనే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
గతేడాదికంటే తగ్గిన ఆదాయం
గతేడాది ఆగస్టు నెల మొత్తంగా మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి రాజీవ్గాంధీ ఎయిర్పోర్టుకు టికెట్లతో రూ. 1.68 కోట్ల ఆదాయం రాగా, ఏ ఏడాది ఆగస్టులో రూ. 1.07 కోట్లు వచ్చింది. లింగంపల్లి నుంచి ఎయిర్పోర్టు రూట్లో గతేడాది ఆగస్టులో 65 శాతం ప్రయాణికుల ఆక్యుపెన్సీ (ఓఆర్) నమోదవగా ఈ ఏడాది ఆగస్టులో 40 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదయింది.
జేబీఎస్ నుంచి ఎయిర్పోర్టు రూట్లో గతేడాది ఆగస్టులో 81 శాతం ఓఆర్ నమోదవగా ఈ ఏడాది 55 శాతం ఓఆర్ నమోదయింది. ఎయిర్పోర్టు రూట్లలో ఆక్యుపెన్సీ తగ్గడంతో ప్రత్యామ్నాయ రూట్లలో పుష్పక్ బస్సులు నడిపే రూట్మ్యా్పలను ఆర్టీసీ పరిశీలిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News