Share News

ఆపరేషన్ సేఫ్ స్కూల్.. విద్యార్థుల రక్షణే లక్ష్యం: సజ్జనార్

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:41 PM

ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విద్యాసంస్థల దగ్గర ఉండే పాన్ షాపుల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ,స్పెషల్ టీం, ఎచ్ న్యూ మొత్తం 5000 మంది సిబ్బంది ఈ రైడ్స్‌లో పాల్గొన్నారని పేర్కొన్నారు.

ఆపరేషన్ సేఫ్ స్కూల్.. విద్యార్థుల రక్షణే లక్ష్యం: సజ్జనార్
Hyderabad CP Sajjanar

హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విద్యాసంస్థల దగ్గర ఉండే పాన్ షాపుల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వ్యాఖ్యానించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్,స్పెషల్ టీం, ఎచ్ న్యూ మొత్తం 5000 మంది సిబ్బంది ఈ రైడ్స్‌లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సజ్జనార్ మాట్లాడారు. విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో ఉన్న 500కుపైగా పాన్ షాపుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించామని తెలిపారు.


పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదు..

విద్యాసంస్థలకు 100 మీటర్లలోపు పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదని సీపీ సజ్జనార్ ఆదేశించారు. అలా విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు పాన్ షాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని.. తీరు మార్చుకోకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. స్కూలు పరిసరాలు పొగాకు రహితంగా ఉండాలని సూచించారు. స్కూల్ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారని తమకు పలు ఫిర్యాదులు అందుతున్నాయని ప్రస్తావించారు.


5 వేలమంది పోలీసులతో స్పెషల్ డ్రైవ్..

విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెంది తమకు ఫిర్యాదులు చేశారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. తమ పోలీస్ సిబ్బంది కూడా డికాయ్ ఆపరేషన్ నిర్వహించారని.. పొగాకు ఉత్పత్తులు స్కూల్ విద్యార్థులకు అమ్ముతున్నట్లు తమ విచారణలో తేలిందని చెప్పుకొచ్చారు. స్కూళ్ల వద్ద కొన్ని రోజుల నుంచి నిఘా పెట్టామని.. ఈరోజు ఐదు వేలమంది పోలీసులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. పొగాకు ఉత్పత్తులను విద్యార్థులు తీసుకోవడం మొదలుపెడితే.. డ్రగ్స్ వైపు మళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ శివధర్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం చారిత్రాత్మకం: రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై మా ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 06:46 PM