హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. ప్రయాణికులకు తీవ్రగాయాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:00 AM
హైదరాబాద్ ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మసీద్ బండ నుంచి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఓ కారు అదుపు తప్పి ట్రాఫిక్ అవుట్పోస్టును బలంగా ఢీకొట్టింది.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న(గురువారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మసీద్ బండ నుంచి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఓ కారు అదుపు తప్పి ట్రాఫిక్ అవుట్పోస్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. కారు ఇంజిన్ భాగం లోపలికి చొచ్చుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
పోలీసుల దర్యాప్తు..
సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపే అవకాశం ఉంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.
వాహనదారులకు హెచ్చరిక..
ఐటీ కారిడార్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో రోడ్లు ఖాళీగా ఉన్నాయని అతివేగంగా వెళ్లడం ప్రమాదాలకు దారితీస్తోందని పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వేగం కంటే ప్రాణం ముఖ్యమని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!
Read Latest Telangana News And AP News And International News And Telugu News