Share News

ఎస్ఐఆర్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - May 11 , 2026 | 03:29 PM

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడుతామని వ్యాఖ్యానించారు.

ఎస్ఐఆర్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, మే11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడుతామని వ్యాఖ్యానించారు. ఈరోజు (సోమవారం) సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్‌ చేశారు. ఈ చిట్‌చాట్‌లో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, మావోయిస్టుల సరెండర్‌లు, మహిళా రిజర్వేషన్లు, రీజినల్ రింగ్ రోడ్, బండి భగీరథ్ కేసు వంటి అనేక కీలక అంశాలపై స్పందించారు.


ప్రధాని మోదీతో అభివృద్ధి అంశాలపైనే చర్చ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(ఆదివారం) హెచ్‌ఐసీసీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హెచ్‌ఐసీసీలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాను ప్రస్తావించిన అభివృద్ధి అంశాలను ప్రధాని మోదీ అంగీకరించారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర సహకారం అవసరమని, అదే విషయాన్ని మోదీ దృష్టికి తాను తీసుకెళ్లానని చెప్పుకొచ్చారు. ‘నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని... కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు అడగలేదని, తాము మాత్రం తెలంగాణ హక్కుల కోసం అడుగుతున్నామని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ప్ర‌ధాని మోదీ స‌మావేశం కావ‌డం ప్రైవేట్ కార్య‌క్ర‌మమని చెప్పుకొచ్చారు.

కేంద్రం నిధులు ఇవ్వాలి..

రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం 50 శాతం నిధులు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో, సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్ వంటి కొన్ని ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్‌లు, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ ప్రాజెక్టుకు ఏడీబీ నిధులు, నేషనల్ హైవేలకు అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు.


తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..

2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తాను ప్రధాని మోదీని కోరగా ఆయన అంగీకరించారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం అవసరమని తెలిపారు. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని ప్రధాని చెప్పారని.. తమ మధ్య జరిగిన చర్చ పూర్తిగా అభివృద్ధికి సంబంధించినదేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలం..

బీజేపీని ‘బ్రిటిష్ జనతా పార్టీ’గా సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. విభజించి పాలించడం ఆ పార్టీ సిద్ధాంతమని ఆరోపించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, మావోయిస్టులు కూడా ఈ దేశ ప్రజలేనని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారిని ఖతం చేయడం వాళ్ల విధానమని విమర్శించారు. తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారిని ఒప్పించి జనజీవనంలో కలపడం కాంగ్రెస్ విధానమని వ్యాఖ్యానించారు. విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదన్నారు. జెమిని సర్కస్ లా బీజేపీ ఎన్నికల విధానం ఉంటుందని ఎద్దేవా చేశారు. అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్నిసంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు.

ఎస్ఐఆర్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోంది..

ఎస్ఐఆర్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో 90 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. కేరళంలో 3 సీట్లు, తమిళనాడులో ఒక సీటు మాత్రమే బీజేపీ గెలుచుకుందని ప్రస్తావించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ఐఆర్‌ను ప్రయోగిస్తున్నారని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ రాలేదని.. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏమిటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రెండు సీట్ల‌తో ప్రారంభ‌మైందని..అక్క‌డికే వ‌స్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ను మోదీ విమ‌ర్శిస్తే తనను విమ‌ర్శించిన‌ట్లేనని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఆశించిన మేర‌కు స‌హ‌కారం లేదని చెప్పారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదని మండిపడ్డారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించకుండా నిర్లక్ష్యం ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ జపం చేయకుండా బీజేపీ బతకదని విమర్శించారు.


మావోయిస్టుల లొంగుబాటుకు ప్రత్యేక చర్యలు..

తెలంగాణలో 818 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెబుతోందని, చివరకు మావోయిస్టులు కూడా అదే మార్గంలోకి వచ్చారని అన్నారు. మావోయిస్టుల లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పారు. గణపతి వంటి నేతలు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే వైద్య సహాయం, ఆర్థిక సాయం కూడా అందిస్తామని తెలిపారు. దేశం కోసం కాంగ్రెస్ ప్రాణాలు ఇచ్చిందని ఉద్ఘాటించారు. రాజీన్ గాంధీని చంపిన వాళ్లకు కూడా సోనియా గాంధీ క్షమాభిక్ష పెట్టారని ప్రస్తావించారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం..

ప్రధాని మోదీ మాట్లాడిన కొన్ని మాటలు దురదృష్టకరమని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ముస్లింలు, క్రిస్టియ‌న్లు, ఇత‌ర మ‌తాలు, కులాలు, మావోయిస్టులు దేశ ప్ర‌జ‌లు కారా.. అంద‌రికీ స‌మాన హ‌క్కులు ఉన్నాయని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాన్ని వ్య‌తిరేకించిన వాళ్ల‌ను ఖ‌తం చేయ‌డ‌మే వాళ్ల విధానమని మండిపడ్డారు. తమ సిద్ధాంతాన్ని వ్య‌తిరేకించిన వాళ్ల‌ను ఒప్పించి జ‌న‌జీవ‌నంలో క‌ల‌ప‌డం తమ విధానమని ఉద్ఘాటించారు. మనుషులను చంపడం పరిష్కారం కాదని.. ముస్లింలు, మావోయిస్టులు కూడా ఈ దేశ భాగస్వాములేనని అన్నారు. దేశంలో ఐక్యత పెంచేలా ప్రధాని మాట్లాడాలని, విడదీసేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని చెప్పారు. ఇది బీజేపీ వివక్ష రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.

విదేశాంగ విధానంపై కేంద్రంపై విమర్శలు..

బంగారం కొనొద్దు, విమానాల్లో ప్రయాణం చేయొద్దని ప్రజలకు చెప్పడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. విదేశాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రతిపక్షాల సూచనలు తీసుకోవాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కేంద్రానికి సూచించారు. మోదీ అనుభవరాహిత్యం, అహంకారం వల్ల దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు.


అలా మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు..

మహిళా రిజర్వేషన్‌ను దేనికి సంబంధం లేకుండా అమలు చేయడానికి అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన 543 లోక్‌సభ సీట్లను దామాషా ప్రకారం చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. 50 శాతం పెంపు అనే దానికి కూడా ఎలాంటి ఫార్ములా లేదని చెప్పుకొచ్చారు. సీట్ల పెంపకంపైనే అందరికీ అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. జమిలి ఎన్నికలు 2029లో జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

బండి భగీరథ్ కేసు దర్యాప్తులో వేగం పెంచాం..

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసు విషయంపై కూడా సీఎం స్పందించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మే 8వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదైందని, ప్రధాని మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్ల కారణంగా విచారణ ఆలస్యమైందని వివరించారు. ఇప్పుడు దర్యాప్తు వేగవంతం చేశామని, సిట్ ఏర్పాటు చేశామని.. సీనియర్ మహిళా అధికారిని విచారణాధికారిగా నియమించినట్లు చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. ఎవరినీ ఇప్పటివరకు వదలిపెట్టలేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై విమర్శలు..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కూడా సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన ఆయనే తర్వాత ప్రభాకర్ రావును నీతిమంతుడని చెప్పారని గుర్తుచేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్‌కు ఇవ్వొచ్చని.. మైక్‌ల ముందు స్టేట్‌మెంట్లు ఇవ్వడం వల్ల విచారణ జరగదన్నారు. కేటీఆర్ బామ్మర్థి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుని దొరికినా తాము వదల్లేదని తెలిపారు. ఖాళీగా ఉన్నామని కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసుల డ్యూటీ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. గడీలు బద్దలు కొడతానని గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారని ప్రస్తావించారు.

రైతులు, ధాన్యం కొనుగోళ్లపై..

అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయినప్పటికీ తడిసిన ధాన్యాన్ని కూడా తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు విస్తృత చర్చలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు వివరణ ఇచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. యూరియా కేంద్రం ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వం పంచాలని తెలిపారు.

తుమ్మిడిహట్టి అంశంపై కేంద్రానికి లేఖ..

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మహారాష్ట్ర సీఎం స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి కూడా లేఖ పంపినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రధాని పెద్దరికం వహిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వారా కూడా చర్చలు జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం కావాలి: సీఎం రేవంత్‌

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ

మోదీ ఆశీస్సులు, మార్గదర్శనం నాకు ఎప్పటికీ ప్రత్యేకం: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 04:17 PM