శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. పోలీసుల అలర్ట్
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:17 AM
శంషాబాద్ విమానాశ్రయంలోని రెండో టెర్మినల్కు సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపుతో భద్రతా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్కు ఈరోజు(సోమవారం) బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు టెర్మినల్ అంతటా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ తనిఖీల తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇది ఫేక్ ఈ -మెయిల్ అని నిర్ధారించారు.
పోలీసుల దర్యాప్తు..
ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. మెయిల్ సోర్స్, ఐపీ అడ్రస్ తదితర వివరాలను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. తనిఖీల సమయంలో కాసేపు విమానాశ్రయంలో భద్రతా జాగ్రత్తలు చేపట్టినప్పటికీ, సాధారణ విమాన సేవలకు పెద్ద అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. ఇది ఫేక్ ఈ -మెయిల్ అని తేలడంతో విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు
Read Latest Telangana News And AP News And International News And Telugu News