‘చిన్నారి రాధ’కు నీరాజనం.. భక్తుల స్పందనకు నెటిజన్ల ఫిదా!
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:21 AM
రాధాదేవి వేషధారణలో ఆలయానికి వెళ్లిన ఓ చిన్నారి భక్తులను తెగ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన ఆమెను చూసిన కొందరు భక్తులు చిరునవ్వుతో పలకరించగా, మరికొందరు ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆలయంలోకి రాధాదేవి వేషధారణలో వచ్చిన ఓ చిన్నారి భక్తుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆమెను చూసిన పలువురు భక్తులు ఆప్యాయంగా పలకరించడమే కాకుండా.. పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆస్తా మాలిక్ అనే మహిళ తన కుమార్తెను సంప్రదాయ రాధాదేవి వేషధారణలో అలంకరించి ఆలయానికి తీసుకెళ్లారు. చిన్నారి నుదుటన తిలకం, సంప్రదాయ ఆభరణాలు, అందమైన వస్త్రాలతో అచ్చం రాధాదేవిగా కనిపించింది. ఆలయ ప్రాంగణంలోకి చిన్నారి అడుగుపెట్టగానే అక్కడున్న భక్తుల చూపంతా ఒక్కసారిగా ఆమెవైపే మళ్లింది. పలువురు చిరునవ్వుతో ఆమెను పలకరించగా.. మరికొందరు దగ్గరకు వెళ్లి మరీ పాదాలకు నమస్కరించారు. తర్వాత ఆ చిన్నారి తన దారిలో తాను నడుస్తూ వెళ్తుండగా.. భక్తులు ఆమెను చూసి మురిసిపోతున్న దృశ్యాలూ వీడియోలో కనిపిస్తున్నాయి. కొందరు చేతులు జోడించి నమస్కరించగా, మరికొందరు ఆప్యాయంగా పలకరించారు. చిన్నారి రాకతో ఆలయంలో ఆనంద వాతావారణం వెల్లివిరిసినట్లైంది.
ఈ ముచ్చటైన దృశ్యాలను చిన్నారి తల్లి ఆస్తా మాలిక్ ఇన్స్టా వేదికగా పంచుకోగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'రాధే రాధే' అంటూ భక్తులు చిన్నారిని పలకరించడం, ఆప్యాయంగా ఆశీర్వదించడం వంటివి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. చిన్నారితో భక్తులు సున్నితంగా వ్యవహరించిన తీరునూ పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి:
‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!
మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!