మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:51 PM
గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్ల నిధులు విడుదల చేసింది.
మేడారం, జనవరి23(ఆంధ్రజ్యోతి): గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరకు(Medaram Jatara) కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్ల 70 లక్షల నిధులను విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో ఈ నిధులను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా మంజూరు చేశాయి. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మేడారం జాతరకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలివస్తుండటంతో.. భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పర్యాటక అభివృద్ధి...
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘గిరిజన సర్క్యూట్’ పథకం కింద ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద గతంలో సుమారు రూ.80 కోట్ల వ్యయంతో ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు కల్పించారు. రోడ్లు, వసతి సౌకర్యాలు, పర్యాటక సమాచార కేంద్రాలు, ఇతర సదుపాయాలు కల్పించడంతో ఈ ప్రాంతాలకు పర్యాటక ఆకర్షణ మరింత పెరిగింది.
రామప్ప ఆలయ అభివృద్ధి..
యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.140 కోట్లను వెచ్చిస్తోంది. రామప్ప ఆలయం, మేడారం జాతర, పరిసర అటవీ ప్రాంతాలు అన్నింటినీ కలిపి తెలంగాణ గిరిజన, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు..
అమ్మవార్లకు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రవాణా సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ జాతర జరిగే నాలుగు రోజుల పాటు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్ల ద్వారా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు సులభంగా మేడారం చేరుకునేలా ఏర్పాటు చేశారు.
గిరిజన సంస్కృతికి ప్రతీక..
సమ్మక్క - సారలమ్మల జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి జాతరతో భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా సహకారం అందించడం గిరిజన సంస్కృతి పరిరక్షణకు తోడ్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సిట్ ముందుకు కేటీఆర్.. ఆ విషయాలపైనే విచారణ
ట్యాపింగ్ పేరుతో రాజకీయ క్రీడ.. రేవంత్పై ప్రవీణ్ తీవ్ర విమర్శలు
Read Latest Telangana News And Telugu News