వివాహ రిసెప్షన్లో దారుణం.. పెళ్లికొడుకుపై కత్తితో దాడి
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:35 PM
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శుభకార్యం కాస్తా భయాందోళనల మధ్య ముగిసింది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఎంతో ఉత్సాహంగా ఉన్న పెళ్లికొడుకుపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు.
పశ్చిమగోదావరి జిల్లా, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శుభకార్యం కాస్తా భయాందోళనల మధ్య ముగిసింది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఎంతో ఉత్సాహంగా ఉన్న పెళ్లికొడుకుపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దాడిపై పాలకొల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లుకు చెందిన చందక సాయి కుమార్, గుడిమెట్ల శ్రీ దుర్గలు ఇటీవల ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహ రిసెప్షన్ వేడుక జరుగుతుండగా ఒక్కసారిగా గోగులమండ శ్రీనివాస్ అనే వ్యక్తి.. పెళ్లి కొడుకు చందక సాయి కుమార్పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. శ్రీనివాస్.. పెళ్లికొడుకు ఇంటి సమీపంలోనే నివసిస్తున్నాడు. ఈ దాడిలో సాయి కుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గమనించిన బంధువులు, స్నేహితులు అతడిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స, ప్రస్తుత పరిస్థితి..
ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం సాయి కుమార్ కోలుకోవడంతో వైద్యులు అతడిని ఇంటికి పంపించారు. ప్రాణాపాయం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే శుభకార్యం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో పెళ్లి బృందం ఒక్కసారిగా షాక్కు గురైంది.
దాడికి కారణాలివేనా..?
సాయి కుమార్ ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా..? లేదా నిందితుడు శ్రీనివాస్కు, సాయి కుమార్ కుటుంబానికి మధ్య మరేవైనా పాత కక్షలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు.. పెళ్లికొడుకు ఇంటి పక్కనే నివసిస్తుండటంతో పక్కా ప్లాన్తోనే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పోలీసుల చర్యలు..
సమాచారం అందుకున్న వెంటనే పాలకొల్లు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు గోగులమండ శ్రీనివాస్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు దాడికి గల కారణాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. పట్టపగలే, అందరూ చూస్తుండగానే జరిగిన ఈ దాడిపై స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడితేనే అసలు విషయాలు బయటకు రానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
కీలక భేటీకి ఎన్డీఏ సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన చర్చ
Read Latest AP News And Telangana News And International News And Telugu News