మా నేతలను విమర్శిస్తే ఊరుకోం.. అనిల్కు కోటంరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:59 PM
మాజీ మంత్రి అనిల్ కుమార్పై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అనిల్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
నెల్లూరు, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అనిల్ కుమార్పై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు ( బుధవారం) నెల్లూరు వేదికగా మీడియాతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. అనిల్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ‘జిల్లాలో ఏ వైసీపీ నేత నీ వెంట ఉన్నారో చెప్పు అనిల్’ అని సవాల్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చీమకు కూడా అపకారం చేయని తత్వం ఉండే వ్యక్తులను.. తాను ముగ్గురిని చూశానని తెలిపారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే జేకే రెడ్డి, మరొకరు మాగుంట సుబ్బిరామిరెడ్డి, వీరి తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారని చెప్పుకొచ్చారు.
వేమిరెడ్డిపై.. అనిల్ మాటలు నిరాధారమైనవి..
వేమిరెడ్డి అంటే ఎందుకంతా కోపమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనపై కక్ష.. వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఉందని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలు పర్వాలేదు కానీ, వ్యక్తిగత దూషణలు తప్పని హితవు పలికారు. వేమిరెడ్డిపై.. అనిల్ మాట్లాడే మాటలు నిరాధారమైనవని చెప్పారు. సాధారణంగా విమర్శలు ప్రతి విమర్శలకు తాను దూరమని, కానీ రేపటి నుంచి కొత్త నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. టీడీపీ కార్యకర్త నుంచి సీఎం వరకు ఎవరి గురించి అయినా.. వైసీపీ నేతలు శృతి మించి వ్యాఖ్యలు చేసినా తాను స్పందిస్తానని స్పష్టం చేశారు.
వేమిరెడ్డి అజాత శత్రువు..
వేమిరెడ్డి అజాత శత్రువు అని.. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మధ్య ఫెవికాల్ బంధం ఉందని చెప్పుకొచ్చారు. తమ నేతల మధ్య విబేధాలు సృష్టించాలని అనిల్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. కేంద్ర నిధులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఎన్నికలు జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వందకు వంద శాతం త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలువబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి మేయర్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో గెలువబోతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News