రాయలసీమను జగన్ ముంచేశారు.. సోమిరెడ్డి ధ్వజం
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:44 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమను జగన్ ముంచేశారని ధ్వజమెత్తారు.
నెల్లూరు జిల్లా, జులై 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం సీనియర్ నేత, మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమను జగన్ ముంచేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు ఏం చేశారో వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్లో ఆత్మపరిశీలన సమావేశం పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఈరోజు (మంగళవారం) నెల్లూరు వేదికగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ రాజకీయ నిరుద్యోగుల కోసం అర్ధం లేని సమావేశాలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
గన్ కల్చర్తో చిచ్చు పెట్టే కుట్రలు మానుకోవాలి..
నిద్రలేచిన దగ్గర నుంచి గన్ కల్చర్తో రాయలసీమ - ఉత్తరాంధ్ర - కోస్తా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను జగన్ అండ్ కో మానుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ఆయా ప్రాజెక్టుల పేర్లు ఎత్తే అర్హత కూడా వైసీపీ నేతలకు లేదని ఆగ్రహించారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో కేవలం రూ.2 వేల కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.12వేల కోట్లపై చిలుకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులకు ఖర్చు చేసిందని వెల్లడించారు. మరో రూ.10వేల కోట్ల కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేసి 40శాతం కూడా నిధులు ఖర్చు పెట్టకుండా వ్యవసాయ, ఆర్ అండ్ బీతో జలవనరుల శాఖలను మూసేశారని దుయ్యబట్టారు.
జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ను గ్రీన్ ట్రైబ్యునల్ ఆపింది..
రాయలసీమ లిఫ్ట్ను గ్రీన్ ట్రైబ్యునల్ ఆపింది జగన్ హయాంలో కాదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ను ఆపించింది తామేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ప్రకటించలేదా..? అని నిలదీశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి కోర్టుతో జగన్ చివాట్లు కూడా తిన్నారని ప్రస్తావించారు. రాయలసీమకు ఎంతో అవసరమైన బిందు సేద్యాన్ని మూసేసిన వారికి సమావేశాలు పెట్టే అర్హత ఎక్కడుంది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులంటే లెక్కలేనితనంతో జగన్ చాలా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఎవరేం చేశారో తేల్చుకునేందుకు వైసీపీ నేతలతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పోలవరం పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ముంబై ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం దేవేంద్ర ఫడణవీస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News