Share News

కృష్ణ జిల్లాలో పోలీసుల ఛేజింగ్.. గంజాయితో పట్టుబడ్డ యువకులు

ABN , Publish Date - May 24 , 2026 | 07:31 AM

కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలో ఆదివారం ఉదయం పోలీసులు చాకచక్యంగా గంజాయి ముఠాను పట్టుకున్నారు. గూడూరు-చల్లపల్లి పోలీసులు 12 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

కృష్ణ జిల్లాలో పోలీసుల ఛేజింగ్..  గంజాయితో పట్టుబడ్డ యువకులు
Krishna District Ganja Seizure

కృష్ణా జిల్లా, (మచిలీపట్నం), మే 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా గూడూరు మండలం విజయవాడ–మచిలీపట్నం ప్రధాన రహదారిపై పోలీసులు ఈరోజు(ఆదివారం) వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వస్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో ఒకే బైక్‌పై ఇద్దరు యువకులు వేగంగా రావడం గమనించిన గూడూరు చల్లపల్లి పోలీస్ సిబ్బంది, వారిని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూడగానే ఆ యువకులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. బైక్‌ను ఆపకుండా, పోలీస్ సిబ్బందిని దాటుకుని అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్లారు.


యువకుల ప్రవర్తనపై అనుమానం..

యువకుల ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పారిపోతున్న బైక్‌ను పట్టుకునేందుకు పోలీసులు వెంటనే తమ వాహనాల్లో వెంబడించారు. పోలీసుల చేజింగ్ కొనసాగుతున్న సమయంలో, నిందితులు మరింత వేగంగా బైక్‌ను నడిపారు. ఈ క్రమంలో చల్లపల్లి–పెద్ద కల్లేపల్లి జంక్షన్ వద్దకు రాగానే, అతివేగం కారణంగా బైక్ అదుపుతప్పింది. రోడ్డుపై ఉన్న పోలీస్ బారికేడ్లను సదరు బైక్ ఢీకొట్టింది. బారికేడ్లను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక యువకుడు కిందపడటంతో అతని కాలికి గాయమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్పందించి, గాయపడిన యువకుడిని తక్షణ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


12 కిలోల గంజాయి లభ్యం

ప్రమాదం జరిగిన అనంతరం పోలీసులు సదరు బైక్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గంజాయి బయటపడింది. గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న సుమారు 12 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కేసు నమోదు.. విచారణ ముమ్మరం..

ప్రస్తుతం పోలీసులు ఈ గంజాయి నెట్‌వర్క్‌పై దృష్టి సారించారు. నిందితులు ఈ గంజాయిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు?, దీనిని మచిలీపట్నం లేదా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరికి సరఫరా చేయడానికి తీసుకెళ్తున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లాలో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్

నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 07:46 AM