Share News

నా కుమారుడు మహేశ్‌ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్‌ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 02:19 PM

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఎంపీ మహేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. విచారణ తర్వాత నిజాలు తెలుస్తాయని, టీడీపీ హై కమాండ్‌కి వివరణ ఇచ్చామని చెప్పారు.

నా కుమారుడు మహేశ్‌ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్‌ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్‌
MLA Putta Sudhakar Yadav

కడప జిల్లా, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు వివాదంపై కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ (MLA Putta Sudhakar Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు(సోమవారం) కడప జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడారు. తన కుమారుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంపై క్లారిటీ ఇచ్చారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై సుధాకర్ యాదవ్ స్పందించారు.


డ్రగ్స్ కేసుపై పుట్టా సుధాకర్ యాదవ్ వివరణ

‘నా కుమారుడు నిరపరాధి’ అని తెలిపారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు.

పార్టీకి వెళ్లిన మాట వాస్తవమే, కానీ..

మొయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి ఎంపీ మహేశ్‌కుమార్ యాదవ్ వెళ్లిన మాట నిజమేనని పుట్టా సుధాకర్ యాదవ్ అంగీకరించారు. అయితే, తన కుమారుడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని, ముఖ్యంగా డ్రగ్స్ తీసుకునే అలవాటు అస్సలు లేదని స్పష్టం చేశారు.


వైద్య పరీక్షలపై అభ్యంతరం..

మహేశ్ వద్ద నుంచి కనీసం బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండానే రిపోర్టులో పాజిటివ్ అని ఎలా నిర్ధారిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ధారణ ప్రక్రియపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

పార్టీ అధిష్ఠానానికి నివేదిక..

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను తెలుగుదేశం పార్టీ (TDP) అధిష్ఠానానికి సమర్పించినట్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వెల్లడించారు. పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోందని, ఇన్వెస్టిగేషన్ ముగిశాక అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

అన్ని వివరాలతో మీడియా ముందుకొస్తాం..

పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత, మహేశ్ నిరపరాధి అని నిరూపించే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌కు అనేక విద్యాసంస్థలు తీసుకువచ్చా: సీఎం చంద్రబాబు

మా ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోంది.. మంత్రి ఆనం ధ్వజం

దేవుడికి, కన్నతల్లికి జగన్ గౌరవం ఇవ్వరు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 23 , 2026 | 03:47 PM