జగన్ హయాంలో రైతన్నలని పట్టించుకోలేదు.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:15 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అన్నదాతలని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
గుంటూరు జిల్లా, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Kinjarapu Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అన్నదాతలని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రైతన్నలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. జగన్ హయాంలో అన్నదాతలు అనేక కష్టాలు పడ్డారని చెప్పుకొచ్చారు. ఇవాళ (శుక్రవారం) గుంటూరు మిర్చి యార్డ్ నూతన పాలకమండలి ప్రమాణస్వీకార మహోత్సవం జరిగింది. చైర్మన్గా కుర్రా అప్పారావు, వైస్ చైర్మన్గా బిట్రగుంట మల్లిక ప్రమాణ స్వీకారం చేశారు.
నూతన కమిటీతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నక్కా ఆనంద బాబు, చదలవాడ అరవింద్ బాబు, బూర్ల రామాంజనేయులు, భాష్యం ప్రవీణ్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు, మిర్చి యార్డ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి కూటమి శ్రేణులు పోటెత్తారు.
మార్కెట్ యార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. గుంటూరు మిర్చి యార్డ్ అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు. ఏపీలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన మార్కెట్ గుంటూరు మిర్చి యార్డ్ అని పేర్కొన్నారు. మిర్చి రైతుల పెట్టుబడి ఇబ్బందులు, నష్టాలను అరికట్టేందుకు కృషిచేస్తామని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మార్కెట్తో పోటీపడాలంటే రైతులు పురుగు మందుల వాడకం తగ్గించి.. నాణ్యమైన దిగుబడి సాధించడంపై దృష్టి సారించాలని వివరించారు. సిటీ నడిబొడ్డుకు చేరిన యార్డ్ మార్పుపై నివేదిక ఇస్తే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తామని మాటిచ్చారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Read Latest Telangana News And AP News And Telugu News