వైసీపీ నేత హైటెక్ మోసం.. ఆందోళనలో బాధితులు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:09 PM
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ హైటెక్ మోసం ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా లక్షల కోట్లు తన ఖాతాలో ఉన్నాయని నమ్మించి, కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన వైసీపీ నేత వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం జిల్లా, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ హైటెక్ మోసం ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా లక్షల కోట్లు తన ఖాతాలో ఉన్నాయని నమ్మించి, కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన వైసీపీ నేత (YSRCP Leader Fraud Case) వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వందలు, వేలల్లో మోసాలు వింటుంటాం.. కానీ ఇక్కడ ఒక నేత ఏకంగా తన బ్యాంక్ ఖాతాలో రూ. 7 లక్షల కోట్లు ఉన్నాయంటూ సృష్టించిన నకిలీ పత్రాలు చూసి జనం అవాక్కవుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఎర్రిస్వామి ఈ భారీ స్కామ్కు తెరదీశారు.
నకిలీ పత్రాలే పెట్టుబడి..
ఎర్రిస్వామి తన వద్ద అపారమైన ధనం ఉందని నమ్మించేందుకు అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. తన బ్యాంక్ ఖాతాలో రూ.7 లక్షల కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు ఒక ఫోర్జరీ స్టేట్మెంట్ను తయారు చేశారు. ఈ భారీ మొత్తాన్ని విత్డ్రా చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించినట్లుగా తప్పుడు పత్రాలను సృష్టించారు. ‘ఈ డబ్బు డ్రా చేయడానికి కొంత ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. మీరు ఇప్పుడు నాకు సాయం చేస్తే, డబ్బు డ్రా అయిన వెంటనే మీకు భారీగా వాటా ఇస్తాను’ అంటూ అమాయకులకు వైసీపీ నేత ఆశ చూపించారు.
రూ. 3 కోట్ల వసూళ్లు..
వైసీపీ నేత ఎర్రిస్వామి మాయమాటలు నమ్మిన పలువురు బాధితులు.. తమ వద్ద ఉన్న డబ్బును, అప్పులు చేసి మరి ఆయనకు సమర్పించారు. ఇప్పటివరకు సుమారు రూ.3 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోవడంతో బాధితులు నిలదీశారు.
విస్తుపోయే నిజాలు..
ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులను స్పష్టత కోరగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సదరు వైసీపీ నేత చూపించిన స్టేట్మెంట్కు, తమ బ్యాంకుకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. అవి పక్కాగా సృష్టించిన నకిలీ పత్రాలని వారు తేల్చేశారు. ఈ వ్యవహారం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారినప్పటికీ, ఇప్పటివరకు తమకు అధికారికంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులు తమ డబ్బు తిరిగి రాదనే నిరాశతోనో లేదా భయంతోనో ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని అసలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ వ్యక్తి ఖాతాలోనైనా లక్షల కోట్లు ఉండటం, దానికి ఆర్బీఐ నేరుగా వ్యక్తిగత అనుమతులు ఇవ్వడం వంటివి అసాధ్యమని గుర్తించాలని పోలీసులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు
పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా జగన్ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న
Read Latest AP News And Telangana News And International News And Telugu News