గుంతకల్లు-వాడి రైల్వేలైన్ క్వాడ్రప్లింగ్కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - May 07 , 2026 | 01:33 PM
అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి రైల్వే సెక్షన్లో మూడో, నాలుగో లైన్లను నిర్మించాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది.
రూ.4,758 కోట్ల నిధులు కేటాయింపు
కేంద్ర కేబినెట్ నిర్ణయం
గుంతకల్లు(అనంతపురం): గుంతకల్లు-వాడి రైల్వే సెక్షన్లో మూడో, నాలుగో లైన్లను నిర్మించాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. ఇందుకుగానూ రూ.4,758 కోట్లను కేటాయించారు. వివిధ కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, గుంతకల్లు రైల్వే డివిజన్లో అత్యంత ప్రాధాన్యమైన వాడి సెక్షన్ను నాలుగు లైన్లుగా మార్చేందుకు అనుమతులను ఇచ్చింది. ఈ లైన్ ఇప్పటికే డబ్లింగ్ పూర్లయి వినియోగంలో ఉంది. పెరుగుతున్న రైళ్ల ట్రాఫిక్, సరుకు రవాణా అవసరాల దృష్ట్యా ముంబై-చెన్నై మార్గంలో ఉన్న గుంతకల్లు-వాడి సెక్షన్ క్వాడ్రప్లింగ్ లైన్గా మార్పుచేయడానికి మార్గం సుగమమైంది. కాగా గుంతకల్లు-వాడి సెక్షన్లోపాటు దేశంలో మరో రెండు రైల్వే రూట్లను కూడా నాలుగు లైన్లుగా అభివృద్ధిపరచాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నగద-మధుర రైల్వే లైన్కు రూ.16,403 కోట్లు, బుర్హవాల్-సీతాపూర్ రైల్వే లైన్ క్వడ్రప్లింగ్కు రూ.2,276 కోట్లు కేటాంచింది.
పెరగనున్న సరుకు రవాణా సామర్థ్యం
గుంతకల్లు-వాడి రైల్వే సెక్షన్లో లైన్ క్వడ్రప్లింగ్ కావడం వల్ల ఎక్స్ప్రెస్ రైళ్ల ట్రాఫిక్కు ఎంతో అనుకూలత ఏర్పడనుంది. సరుకు రవాణా సదుపాయాలలో గణనీయమైన అభ్యున్నతి కలుగుతుంది. బొగ్గు, ఆహార ధాన్యాలు, సిమెంటు, పెట్రోలు, స్టీల్, ఇనుము, ఎరువులు, బాక్సైట్ తదితర సరుకుల రవాణా సమయం, ఉత్పత్తి వ్యయాలలో ఎంతో పొదుపు సాధ్యపడుతుంది. ఈ లైన్ల వల్ల దాదాపు రూ.60 మెట్రిక్ టన్నుల అదనపు సరుకు రవాణా సాధ్యపడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. వాడి మార్గంలో నాలుగు లైన్ల ట్రాక్ అందుబాటులోకి వస్తే ముంబై-చెన్నై మార్గంలో ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెరుగుతుంది.
ప్రయాణ సమయాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. కాగా ప్రస్తుతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూడు రూట్ల క్వడ్రప్లింగ్ లైన్ల వల్ల రాష్ట్రంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం, దేశంలోని మహాకాళేశ్వర్, రణతంబోర్ జాతీయ ఉద్యానవనం, కునో జాతీయ ఉద్యానవనం, కియోలాడియో జాతీ య ఉద్యానవనం, మధుర జాతీయ ఉద్యానవనం, శ్యాంనాథ్ దేవస్థానం, నైమిశారణ్యం (నీమ్సర్) తదితర ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని రైల్వే శాఖ పేర్కొంది. ఈ మూడు లైన్లు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, యూపీ, ఎంపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పలు వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్ల ఏర్పాటు..
Read Latest Telangana News and National News