Share News

CM Revanth Fires KTR: కవితని ఇంటి నుంచి తరిమేశారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:27 PM

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో సెంటిమెంట్‌ రాజకీయాలు పనికిరావని విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. .

CM Revanth Fires KTR: కవితని ఇంటి నుంచి తరిమేశారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
CM Revanth Reddy Fires KTR

హైదరాబాద్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election)లో కాంగ్రెస్‌ జెండా ఎగరబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మజ్లిస్‌, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో 30 వేల మెజారిటీతో కాంగ్రెస్‌ గెలుస్తుందని జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్‌లో సెంటిమెంట్‌ రాజకీయాలు పనికిరావని విమర్శించారు. పీజేఆర్ మరణిస్తే ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదని గుర్తుచేశారు. పీజేఆర్‌ కుటుంబంపై కేసీఆర్‌ అభ్యర్థిని నిలబెట్టారని ధ్వజమెత్తారు. ఇవాళ(మంగళవారం) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రహమత్‌నగర్‌లో రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌ జరిగింది. SPR హిల్స్‌ నుంచి హబీబ్‌ ఫాతిమానగర్‌ వరకు సీఎం రేవంత్ రోడ్‌ షో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఆ సంప్రదాయాలను కేసీఆర్‌ తుంగలో తొక్కారు..

పీజేఆర్‌ కుటుంబం రిక్వెస్ట్‌ చేసినా కేసీఆర్‌ వినలేదని ఫైర్ అయ్యారు. పీజేఆర్‌పై పోటీపెట్టి సంప్రదాయాలను కేసీఆర్‌ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ నేతలు ఏమని ఓట్లు అడుగుతారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. వేలకోట్లు కొల్లగొట్టిన వ్యక్తి కేటీఆర్‌ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల ఎకరాల్లో కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌లు ఎలా కట్టగలిగారని ప్రశ్నించారు. కేటీఆర్‌ తన చెల్లి కవితకి వాటా ఇవ్వాల్సి వస్తోందని.. ఇంటి నుంచి తరిమేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మొదటిసారి మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ పాలనలో కొండా సురేఖ, సీతక్కలకు మంత్రి పదవులు ఇచ్చామని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఆ అర్హత బీఆర్ఎస్‌కు లేదు..

మహిళా సెంటిమెంట్‌ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదని ఆక్షేపించారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని నొక్కిచెప్పారు. ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్‌ ఓర్వలేకపోతోందని ఆక్షేపించారు. ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదని మాటిచ్చారు. సొంత ఇంటి ఆడబిడ్డను సరిగా చూసుకోలేని వ్యక్తి కేటీఆర్‌ అని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.


తమ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదని భరోసా కల్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిల్లా, రంగాలు ఆటోలో తిరుగుతూ.. ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని అడుగుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో కనీసం రేషన్‌ కార్డులయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఆనాడు కేటీఆర్‌ ఏం మేలు చేశారు..? అని నిలదీశారు. బీఆర్ఎస్‌ను ఎందుకు గెలిపించాలి..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం..

‘కేసీఆర్ హయాంలో ఫార్ములా ఈ కారు రేస్‌ పేరుతో రూ.50 కోట్ల అవినీతి జరిగింది. మా ప్రభుత్వం ఈ కేసుపై విచారణ జరిపి తెలంగాణ గవర్నర్‌కు ఫైల్‌ పంపితే.. ఇప్పటివరకు అనుమతి లేదు. ఇది లోపాయికారీ ఒప్పందం కాదా..?. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుంది. కాళేశ్వరంపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు..?. బీజేపీకి.. బీఆర్ఎస్‌ లొంగకపోతే సీబీఐ విచారణ జరపాలి. మాజీ మంత్రులు కేసీఆర్‌, హరీష్‌రావులను ఎప్పుడు అరెస్టు చేస్తారో బీజేపీ చెప్పాలి. ఈనెల 11వ తేదీలోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టారని.. పలు సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించారు. సీబీఐకి కేసు ఇస్తే 24 గంటల్లో వారిని జైలులో పెడతామని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ కేసును మేం సీబీఐకి ఇచ్చి 3 నెలలు అవుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా ఎందుకు నమోదు కాలేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్‌రెడ్డి

ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్‌‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 09:47 PM