TDP: ఆపరేషన్ సిందూర్కు టీడీపీ పూర్తి మద్దతు
ABN , Publish Date - May 07 , 2025 | 01:28 PM
TDP Supports ON Operation Sindoor: ఆపరేషన్ సిందూర్కు టీడీపీ పూర్తి మద్దతు తెలిపింది. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు భారత బలగాలకు అభినందనలు తెలిపారు. పాకిస్తాన్పై ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు అభినందనీయమని టీడీపీ నేతలు కొనియాడారు.

అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు (Operation Sindoor) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పూర్తి మద్దతు ప్రకటించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఇవాళ(బుధవారం) ఆ పార్టీ అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జాతీయ జెండాలు పట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వందేమాతరం అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న భారత బలగాలకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ, వేపాడ చిరంజీవి, టీడీపీ నేతలు వర్ల రామయ్య, అశోక్ బాబు, ఏవీ రమణ, బుచ్చిరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ని ప్రతీ భారతీయుడు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదానికి ప్రతీగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయమైనా ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతి పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు స్పష్టం చేశారని అన్నారు. మన సైన్యానికి యావత్ భారతావని అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ప్రతీ భారతీయుడు ఈ చర్యను స్వాగతిస్తున్నారు: వర్ల రామయ్య
పాకిస్థాన్ చేసిన తప్పు ప్రపంచానికి చాటేలా భారత్ బలగాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. ప్రతీ భారతీయుడు ఈ చర్యను స్వాగతిస్తున్నారని వర్ల రామయ్య అన్నారు.
పహల్గాం ముష్కరుల దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఆపరేషన్ సిందూర్ భారతదేశాన్ని సగౌరవంగా తలెత్తుకునేలా చేసిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. పహేల్గాం ముష్కరుల దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. ఉగ్రవాదం అంతమయ్యేంతవరకు ఇది కొనసాగుతుందని తెలిపారు. పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని.. ఉగ్రవాదులకు స్థావరాలను కల్పించడం మానేయాలని హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నడుస్తున్న అద్భుతమైన పాలన మాటలతో కాదు చేతలతో సమాధానం చెబుతారని మరోసారి నిరూపితమైందని అన్నారు. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాదులను తెల్లవారుజామున మట్టుబెట్టిన భారతసైన్యానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ సాంకేతిక సత్తా ఏంటో ఇవాళ ప్రపంచానికి తెలిసింది: వెనిగండ్ల రాము
కృష్ణాజిల్లా (గుడివాడ): పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ బలగాలు చేసిన దాడి దృశ్యాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అవుతుండగా ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్ ఆసక్తిగా తిలకించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాంకేతిక సత్తా ఏంటో ఇవాళ ప్రపంచానికి తెలిసిందని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత్... ముష్కరులకు సరైన సమాధానం ఇచ్చిందని అన్నారు. సాధారణ పౌరులకు హాని కలగకుండా కచ్చితమైన ప్రాంతాల్లో దాడులు చేయడంతో భారత్ టెక్నాలజీ శక్తి ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. భారత్ దాడులు ఉగ్రవాదానికి చేసిన హెచ్చరికగా భావిస్తున్నామని అన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలన్న ఉగ్రవాదుల పన్నాగం పారలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, త్రివిధ దళాలకు దేశ ప్రజలందరూ సంఘీభావంగా ఉన్నారని వెనిగండ్ల రాము వెల్లడించారు.
ఉగ్ర శిబిరాలపై దాడులను పూర్తిగా స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గాం కిరాతక దాడికి భారత్ ప్రతీకార చర్య చేపట్టిందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఉగ్ర శిబిరాలపై దాడులను పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులను.. అంతమెందించేలా భారత్ చేసిన దాడులకు ప్రపంచ దేశాలన్నీ మద్దతు తెలిపాయని అన్నారు. సాధారణ పౌరులకు హాని కలిగించకుండా దాడులు చేసిన భారత ఆర్మీకు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అభినందనలు తెలిపారు.
భారత్ శక్తి సామర్ధ్యాల ముందు పాకిస్తాన్ పనికిరాదు: మాజీ సైనిక అధికారులు
విజయనగరం: పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావటంతో మాజీ సైనికులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానిస్తే భారత సైన్యానికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏబిఎన్తో మాజీ సైనిక అధికారులు మాట్లాడారు. భారత సైన్యం అపారమైన సామర్థ్యం కలిగి ఉందని అన్నారు. భారత్ ఆధునిక ఆయుధ సంపత్తి, శక్తి సామర్ధ్యాల దగ్గర పాకిస్తాన్ ఎందుకు పనికిరాదని మాజీ సైనిక అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
India Pak War: పాకిస్తాన్పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..
For More AP News and Telugu News