Anagani Satya Prasad: ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద.. రెవెన్యూశాఖ అలర్ట్
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:28 AM
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు కాలనీల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
అమరావతి, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satya Prasad) కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ (బుధవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వరద ముంపు కాలనీల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. అవసరమైతే ప్రజలను ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల సహాయార్థం విజయవాడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. సోషల్ మీడియాలో పుకార్లను, వదంతులను నమ్మవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో హెల్ప్లైన్ నెంబర్ 9154970545కు కాల్ చేయాలని కోరారు. ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు రెవెన్యూ అధికార యంత్రాంగం, సిబ్బంది, ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మార్గనిర్దేశం చేశారు .
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: లోకేశ్
గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా
For More AndhraPradesh News And Telugu News