కుళ్లిన పండ్లతో జ్యూస్లు
ABN , Publish Date - May 20 , 2026 | 01:45 PM
హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలోని బరిస్టా జ్యూస్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
అడ్వకేట్స్ కాలనీలో బరిస్టా జ్యూస్ సెంటర్ బాగోతం
తనిఖీల్లో గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
వరంగల్: హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలోని బరిస్టా జ్యూస్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సుమారు 20 ఏళ్లుగా పేరొందిన ఈ జ్యూస్ సెంటర్కు ప్రతీ రోజు వందల సంఖ్యలో కళాశాల విద్యార్థులు, కుటుంబాలు రకరకాల జ్యూస్ కోసం ఎగబడుతుంటారు. అంతేగాక జ్యూస్ సెంటర్ పైఅంతస్థులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు.
జ్యూస్ సెంటర్లో మ్యాంగో జ్యూస్ కొనుగోలు చేసిన ఓ యువకుడికి జ్యూస్లో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. విషయాన్ని సెంటర్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లగా అతడు పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో ఆ యువకుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ వెంటనే తమ సిబ్బందితో వచ్చి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో జ్యూస్ సెంటర్ బాగోతం బయటపడింది. జ్యూస్ తయారీలో కుళ్లిన అవకాడో పండ్లు, మామిడి పండ్లు, బూజు పట్టిన పుచ్చపండ్లు, అంజీరాపండ్లు వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు.
అలాగే పైఅంతస్థులోని ఫాస్ట్ఫుడ్ సెంటర్ను తనిఖీ చేయగా నల్లగా ఉన్న వంటనూనెను గుర్తించారు. దీనిని పదే పదే వాడిన నూనెగా గుర్తించి బయట పారబోయించారు. ఇక వంట గదిలో బూజుపట్టిన చికెన్ మంచూరియాను కూడా కనుగొన్నారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ షెడ్యూల్ 4 నిబంధన ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే అపరిశుభ్రతపై ఇంప్రూవ్మెంట్ నోటీసును యజమానికి అందించారు. సస్పెక్టెడ్ యాక్ట్ ప్రకారంగా ఆహారం తయారీకి ఉపయోగించే పదార్థాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్ అందిన అనంతరం యజమానిపై చర్యలు చేపట్టనున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ
Read Latest AP News And Telangana News And International News And Telugu News