మావోయిస్టు సభ్యురాలి కోసం ‘ఇంటెలిజెన్స్’ ఆరా
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:07 PM
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన మావోయిస్టు దండకారణ్య సభ్యురాలు కాశబోయిన స్వరూప గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీశారు.
అక్కన్నపేట(మెదక్): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన మావోయిస్టు దండకారణ్య సభ్యురాలు కాశబోయిన స్వరూప గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. స్వరూప బంధువులు, గ్రామస్థులను కలిసి ఆమె ఎప్పుడు పార్టీలోకి వెళ్లింది..? వెళ్లినప్పుడు నుంచి ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడిందా..? గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను కలిసిందా..? ఆమె గురించి ఇంకేమైనా సమాచారం మీకు తెలుసా..?
బ్రతికి ఉందో.. మృతి చెందిందో అనే వివరాలను సేకరించారు. ఆమెకు చెందిన కూలిపోయిన ఇంటిని పరిశీలించారు. స్వరూప చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ,తాత దగ్గర పెరిగింది. నానమ్మ, తాత చనిపోగా ఆమె చెల్లి మాత్రమే ఉందని వివరాలను తెలుసుకున్నారు.
అలాగే స్వరూప చదువుకున్న పాఠశాలలో ఆమెకు సంబంధించిన ఫోటోలు దొరుకుతాయేమోనని రికార్డులను వెతికారు. ఆమెకు సంబంధించిన వివరాలు దొరకకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. స్వరూప కేసు క్లోజ్ చేసేందుకే వారు వచ్చారని, దండకారణ్య సభ్యురాలుగా కాశబోయిన స్వరూప పనిచేస్తున్నప్పుడు ఆమెపై రెండు లక్షల రివార్డు ఉందని గతంలో పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారనే వివరాలు తెలుసుకునేందుకే ఇంటెలిజెన్స్ సీఐ మల్లికార్జున్ గౌడ్ బృందం వచ్చినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆపదలో ప్రాణదాతగా ప్రథమ చికిత్స
Read Latest AP News And Telangana News And International News And Telugu News