ఫాం పాండ్లపై రైతుల ఆసక్తి
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:30 PM
చేనులో పడిన వర్షపు నీరు వృథాగా పోనివ్వకుండా అక్కడే నీటిని నిలువ చేసుకునేందుకు నిర్మిస్తున్న ఫాం పాండ్లపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు.
పంటలకు జీవంపోసే ఫాంపాండ్లు
100 శాతం ప్రభుత్వ సబ్సిడీ
వీబీజీరాంజీ పథకం కింద నిర్మాణం
ఇల్లంతకుంట(కరీంనగర్): చేనులో పడిన వర్షపు నీరు వృథాగా పోనివ్వకుండా అక్కడే నీటిని నిలువ చేసుకునేందుకు నిర్మిస్తున్న ఫాం పాండ్లపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు. పంటల సాగుసమయంలో వర్షాలు సకాలంలో కురవకపోవడం, పంటవేసిన తర్వాత వర్షం పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వీబీజీరాంజీ పథకం క్రింద రైతులు ఫాంపాండ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించింది.
రైతులు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండానే ఉపాధిహామీ కూలీల ద్వారా దీన్ని నిర్మిస్తున్నారు. 8మీటర్ల పొడవు, 8మీటర్ల వెడల్పుతో 6ఫీట్ల లోతుతో వరదనీరు వచ్చే ప్రాంతలో కూలీలతో గుంత తవ్వడంతో పాటు ఇన్లెట్, అవుట్లెట్లను నిర్మిస్తారు. దీనికి ప్రభుత్వం ఉపాధిహామీ కూలీ లకు రూ. 50వేలు ఖర్చు చేస్తుంది. భూమికోతకు గురికాకుండా రాతి కట్టడం వల్ల నీరు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది.
ఫాంపాండ్ల నిర్మాణాలలో రైతుల ఆసక్తుల మేరకు కొలతలను ప్రభుత్వం నిర్ణయించింది. మండలంలోని ముస్కానిపేట, ఇల్లంతకుంట, జంగమరెడ్డిపల్లె, గాలిపెల్లి తదితర గ్రామాలలో ఇప్పటికే 24ఫాంపాండ్ల నిర్మాణాలు జరిగాయి. ఇవే కాకుండా అనంతగిరి, సిరికొండ గ్రామాల్లో కమ్యూనిటీ ఫాంపాండ్ల పనులు కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణాల వల్ల రైతులకు ప్రయోజనాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
పంటలు ఎండిపోకుండా కాపాడుతుందని, భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడుతుంది. ఫాంపాండ్లో చిన్న మోటార్ పెట్టుకొని కూరగాయలను, వర్మీకంపోస్టు తయారుకు నీటిని వాడుకోవచ్చు. సంవత్సరం పొడవునా పశువులకు తాగునీరు అందుతుంది. అంతే కాకుండా రైతులు ఫారంపాండ్లలో చేపలు సైతం పెంచుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు దీనిపై మరింత ప్రచారం కల్పించడం ద్వారా ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News