Kishan Reddy: జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సంపూర్ణ సహకారం: కిషన్రెడ్డి
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:35 PM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
ఢిల్లీ, జనవరి2 (ఆంధ్రజ్యోతి): జల వివాదాల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం (Central Government) సంపూర్ణ సహకారం అందజేస్తుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆ కమిటీని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నోటిఫై చేసిందని తెలిపారు. కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా తెలుగురాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఉన్నారని వివరించారు. ఈ కమిటీలో KRMB, GRMB చైర్మన్లు, CWC, NWDA చీఫ్ ఇంజినీర్లు ఉన్నారని తెలిపారు. ఈ మేరకు ఇవాళ(శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు కిషన్రెడ్డి.
సంపూర్ణ సహకారం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటుచేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తోందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
కృష్ణాజలాల వినియోగంపై వాదనలు..
ఉదాహరణకు.. కృష్ణానది జల వివాద పరిష్కారానికి 6 అక్టోబర్ 2023నాడు KWDT-2ను (Krishna Water Dispute Tribunal) ఏర్పాటుచేసి.. అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను నిర్దేశించింది. రెండేళ్ల కాల వ్యవధి 1 ఆగస్టు, 2025 నాడు ముగిసింది. కృష్ణాజలాల వినియోగంపై వాదనలు నడుస్తోండటంతో దీన్ని మరో ఏడాది (31 జూలై, 2026) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తోంది.
అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు..
కాగా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9, సెక్షన్ 84 ప్రకారం.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. 16, జూలై 2025 నాడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ (జల్శక్తి) మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కమిటీ..
ఈ సమావేశంలో.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తావించగా.. వాటిని చర్చించి, సాంకేతికతంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని సూచించింది. డిసెంబర్ 23, 2025 నాడు తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయడంతో ఇవాళ (శుక్రవారం) కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది.
కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ నేతృత్వంలో..
ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి.. జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్), చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉండనున్నారు. వీరితోపాటుగా.. కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB) హైదరాబాద్ చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) చీఫ్ ఇంజనీర్, CWC చీఫ్ ఇంజనీర్ కూడా సభ్యులుగా ఉండనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారు.. రేవంత్ సర్కార్పై రాకేశ్రెడ్డి ఫైర్
ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్
For More TG News And Telugu News