తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. సీఎస్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jun 06 , 2026 | 06:27 PM
తెలంగాణలో వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, జూన్6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Telangana CS RamakrishnaRao) ఈరోజు (శనివారం) సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల పరిస్థితులు, వరి కొనుగోళ్లు, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వర్షాల ప్రభావంపై ప్రత్యేకంగా చర్చించిన సీఎస్, అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి..
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న వరి కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
సమన్వయంతో పనిచేయాలి..
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని జిల్లా యంత్రాంగానికి సీఎస్ సూచించారు. వర్షాల పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల హెచ్చరికలు, వరి కొనుగోళ్లు, సీఎం పర్యటనల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం జిల్లాల పర్యటనల ఏర్పాట్లపై చర్చ..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనల ఏర్పాట్లపైనా సీఎస్ అధికారులతో చర్చించారు. సీఎం పర్యటనలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు, ప్రజాసభల నిర్వహణ, రవాణా సౌకర్యాలు, వసతి ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News