ట్రాఫిక్ గాలికొదిలేసి..సెల్ఫోన్ చూస్తూ..
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:44 AM
ఇటీవల మలక్పేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక సిగ్నల్ వద్ద రెడ్లైట్ పడింది. వాహనాలన్నీ ఆగాయి.
పలు జంక్షన్ల వద్ద సిబ్బంది నిర్లక్ష్యం
చేతిలో సెల్ఫోన్.. చెవిలో ఇయర్ ఫోన్స్
వాహనాల రద్దీని గుర్తించరు..
సిగ్నల్ పనిచేయకున్నా పట్టించుకోరు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
హైదరాబాద్ సిటీ: ఇటీవల మలక్పేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక సిగ్నల్ వద్ద రెడ్లైట్ పడింది. వాహనాలన్నీ ఆగాయి. కొద్దిసేపటి తర్వాత రెడ్ సిగ్నల్ వైపు జీరో పడినా సిగ్నల్ అలానే ఉంది. గ్రీన్ సిగ్నల్ పడకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్బూత్లో కూర్చున్న మహిళా కానిస్టేబుల్ను పిలుస్తున్నారు. ఆమె రెండు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, సెల్చేతిలో పట్టుకొని మాట్లాడుతోంది. వాహనదారులు సైగ చేస్తున్నా పట్టించుకోవట్లేదు. సిగ్నల్ పడట్లేదు అని చూపించినా అయితే ఏం చేయమంటారు అన్నట్లుగా అంతే నిర్లక్ష్యంతో క్యాబిన్లోనే ఫోన్ మాట్లాడుతూ కూర్చుంది.
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రముఖ పేరుపొందిన జంక్షన్ సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. అయితే అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉన్నప్పటికీ కొంతమంది వాహనదారులు ముందుకు వచ్చి ఫ్రీలెఫ్ట్కు అడ్డంగా వాహనాలు పెడుతున్నారు. దాంతో వెనుకాల వచ్చి లెఫ్ట్కు వెళ్లాల్సిన వాహనదారులు ఎంత హారన్ కొట్టినా ముందున్నవారు కదలరు మెదలరు. అక్కడే ట్రాఫిక్ బూత్లో కూర్చున్న కానిస్టేబుల్ ఫోన్లో వీడియోలు చూసుకుంటూ దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాడు కానీ కనీసం బయటకు వచ్చి ఫ్రీ లెఫ్ట్ ఆక్రమించొద్దని గానీ, ఆగిఉన్న వాహనాలను పక్కకు పంపి ఫ్రీలెఫ్ట్ క్లియర్ చేసే పనిగానీ చేయలేదు.
నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్, కూడళ్ల వద్ద కొంత మంది ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డుమీద ట్రాఫిక్ జామ్ అయినా, వాహనాల రద్దీ పెరిగినా, సిగ్నల్ వ్యవస్థ సరిగా పని చేయకపోయినా పట్టించుకోరనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ కరువు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఎక్కువ సమయం కార్యాలయంలోనే ఉంటూ కుర్చీలకే పరిమితం అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
వర్షం వచ్చినప్పుడో లేదంటే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తినప్పుడు తప్ప క్షేత్రస్థాయి పర్యటనకు రావడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుపై నిఘా లేకపోవడంతోనే జంక్షన్లు జామ్ అయిపోతున్నాయని, వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఒక సిగ్నల్ పరిధిలో ఏదైనా వాహనం బ్రేక్ డౌన్ అయితే వెంటనే గుర్తించి ముందున్న ట్రాఫిక్ సిగ్నల్ పోలీసులకు సమాచారం ఇచ్చి, ట్రాఫిక్ జామ్ కాకుండా క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఒక్కోసారి వాహనాల రద్దీకి కారణం అవుతోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..
బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News