వాటర్ బోర్డు పేరుతో సైబర్ మోసాలు
ABN , Publish Date - Jun 06 , 2026 | 08:44 AM
వాటర్ బోర్డు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైవ్ డీసీపీ టి. సాయిమనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.
మీటర్ అప్డేట్ కాలేదని సందేశం
ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయించి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేత
అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ సాయిమనోహర్
హైదరాబాద్ సిటీ: వాటర్ బోర్డు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైవ్ డీసీపీ టి. సాయిమనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. మీటర్ అప్డేట్ కాలేదని, బిల్ వెరిఫికేషన్, సీఎఎన్ (క్యాన్) నంబర్ ధృవీకరణ పేర్లతో అమాయకులను మోసం చేసి వేల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు బాధితులకు వాట్సాప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు లేదా ఫోన్ కాల్స్ చేసి, మీ వాటర్ బిల్ అప్డేట్ కాలేదు, మీటర్ రీడింగ్ నమోదు కాలేదు, క్యాన్ నంబర్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది, నీటి కనెక్షన్ నిలిపివేయబడుతుంది వంటి సందేశాలతో భయాందోళనకు గురిచేస్తున్నారు.
సమస్య పరిష్కారం పేరుతో ఏపీకే ఫైళ్లు లేదా క్విక్ సపోర్టు వంటి రిమోట్ యాక్సెస్ యాప్లను డౌన్లోడ్ చేయాలని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేవలం రూ.10, రూ.13 లేదా రూ.20 మాత్రమే చెల్లించాలని చెప్పి బాధితుల నమ్మకాన్ని పొందుతున్నారు. యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ హ్యాంగ్ కావడం, స్ర్కీన్ స్పందించకపోవడం, ఫోన్ అసాధారణంగా పనిచేయడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరికి వీడియో కాల్ ద్వారా సూచనలు ఇస్తూ, మరికొందరిని యూపీఐ, బ్యాంకింగ్ యాప్లలో మేము చెప్పినట్లు చేయండి అని కోరుతున్నారు.
దీంతో బాధితులకు తెలియకుండానే వారి బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి అధిక మొత్తంలో డబ్బు డెబిట్ అవుతోంది. ఇటీవల నమోదైన పలు ఫిర్యాదుల్లో బాధితులు లక్షల రూపాయల నష్టపోయినట్లు డీసీపీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బీ పేరుతో వచ్చే సందేశాలు లేదా కాల్స్ను నమ్మొద్దని వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. ఓటీపీ, సీవీవీ, యూపీఐ పిన్, బ్యాంక్ పాస్ వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ను నిలిపివేయాలని, అనుమానాస్పద యాప్లను తొలగించాలని, బ్యాంక్ ఖాతాలు, కార్డులు, యూపీఐ సేవలను బ్లాక్ చేయించాలని, పాస్వ ర్డ్లు మార్చాలన్నారు. అనంతరం 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని డీసీపీ సాయిమనోహర్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హాస్టళ్లకు, గురుకులాలకు గ్రేడ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News