Share News

కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:29 PM

మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ దాడులకు దిగిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు
BRS

హైదరాబాద్, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ దాడులకు దిగిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల, కౌన్సిలర్ల దౌర్జన్యం, ఇబ్రహీంపట్నం ఎన్నిక స్టే అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించారు.


బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌తో పాటు, పార్టీ నాయకులపై కాంగ్రెస్ గుండాల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నా, కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకొని వాయిదా వేయడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి, అన్యాయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపైనే లాఠీచార్జీకి దిగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఫైర్ అయ్యారు.


న్యాయం కోసం నిరసనకు దిగిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పైనే కేసులు బనాయిస్తామని బెదిరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అటు జనగామలోనూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్‌కి మద్దతు తెలుపుతూ చేయి ఎత్తిన దళిత మహిళా కౌన్సిలర్‌ పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించడం చాలా దారుణమని అన్నారు. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ దాకా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో అడుగడుగునా అరాచక పర్వాన్ని సాగిస్తున్న అధికార కాంగ్రెస్‌కి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 05:55 PM