తెలంగాణ ట్రాన్స్కో డీఈపై అవినీతి ఆరోపణలు.. ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Jul 22 , 2026 | 08:11 AM
తెలంగాణ ట్రాన్స్కో డిపార్ట్మెంట్కు చెందిన డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్, జులై 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ట్రాన్స్కో డిపార్ట్మెంట్కు చెందిన డిప్యూటీ ఇంజినీర్ (డీఈ) ముత్యం వెంకటరమణపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు (బుధవారం) విస్తృత స్థాయిలో సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ముత్యం వెంకటరమణకు చెందిన హైటెక్స్లోని మీనాక్షి స్కై లాంచ్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఎనిమిది ప్రత్యేక బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు లావాదేవీల వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. సోదాల్లో గుర్తించిన ఆస్తులు, నగదు, పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. తనిఖీలు పూర్తి అయ్యాక అధికారికంగా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఏసీబీ బృందాలు సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ
ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News