Share News

ఫాస్ట్‌ఫుడ్‌తో ముప్పు.. నాసిరకం నూనెతో పదార్థాల తయారీ

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:06 PM

ఇప్పుడంతా ఫాస్ట్‌ కల్చర్‌. బిజీబిజీగా గడిపేవారు, నోటికి రుచిగా ఉంటుందని చాలా మంది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

 ఫాస్ట్‌ఫుడ్‌తో ముప్పు.. నాసిరకం నూనెతో పదార్థాల తయారీ

  • లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్న ప్రజలు

  • ఆరోగ్యాలకు చేటంటున్న వైద్యులు

సంగారెడ్డి: ఇప్పుడంతా ఫాస్ట్‌ కల్చర్‌. బిజీబిజీగా గడిపేవారు, నోటికి రుచిగా ఉంటుందని చాలా మంది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వేడిగా తింటున్నామని.. టెస్టీగా ఉందని భావిస్తున్న వారు చేజేతులా తమ ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకుంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలోకి వెళ్లి ఆకలి తీర్చుకుంటున్నామని అనుకుంటున్నారే కానీ అక్కడ తీసుకున్న ఆహార పదార్థాల వల్ల రోగాలను కొనితెచ్చుకుంటున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారు.


నాసిరకం నూనెలతో తయారీ..

కొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఆహార పదార్థాల తయారీకి నాసిరకమైన, కల్తీ నూనెలు, రంగురంగుల రసాయిక పదార్థాలు వినియోగిస్తారు. రసాయనాలు కలిపి ఒకరోజు కలియబెట్టి నిలువ ఉంచి వాటిని మరుసటి రోజు కల్లీ నూనెలో వేయించి, ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేసి ఇస్తున్నారు. గమనించని ప్రజలు వాటిని తిని ఆకలిని తీర్చుకుంటారు. ఈ ఫాస్ట్‌ఫుడ్‌లకు పెద్దవారే కాదు చిన్నారులు సైతం ఇష్టంగా ఆరగించడం వల్ల బాల్యంలోనే రోగాల బారిన పడుతున్నారు.


అపరిశభ్రంగా పరిసరాలు..

కొందరు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల వద్ద యజమానులు ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా వంటకాలు చేసిన వ్యర్థ పదార్థాలను అక్కడి పారవేసి నిలువ ఉంచడం వల్ల ఈగలు, దోమలు తినే పదార్థాలపై వాలుతుంటాయి. అంతేకాకుండా రోడ్డుపక్కనే ఈ సెంటర్లు ఉండడం వల్ల ఆహార పదార్థాలపై వాహనాల రాకపోకలతో ఎగిసిపడే దుమ్ము, దూళీ పడుతుంది. కనీసం వాటిపై దుమ్ము, దూళీ పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించరు. చికెన్‌కు సంబంధించిన వంటకాల్లో చికెన్‌కు బదులు చికెన్‌ చర్మాన్ని తీసుకువచ్చి కలుపుతారనే అనుమానాలు ఉన్నాయి. నోటి రుచితో ఆరగిస్తున్న ఫాస్ట్‌ఫుడ్‌ ఆహార పదార్థాలతో రోగాలు కొనితెచ్చుకుంటున్నారు.


srd3.jpgధరలు కూడా ప్రియమే..

కొన్ని ఫాస్ట్‌ఫుడ్‌లో లభించే ఆహార పదార్థాల ధరలు కూడా అధికంగానే ఉంటున్నాయి. వెజ్‌ నూడిల్స్‌ ప్లేట్‌ రూ. 60, ఎగ్‌ నూడిల్స్‌ ప్లేట్‌ రూ.80, చికెన్‌ నూడిల్స్‌ ప్లేట్‌ రూ.100, మంచూరియా ప్లేట్‌ రూ.80, చికెన్‌ మంచూరియా ప్లేట్‌ రూ.100, చికెన్‌ 65 ప్లేట్‌ రూ.120, ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ ప్లేట్‌ రూ. 80 ధరల్లో విక్రయిస్తున్నారు.


వ్యాధులను ఆహ్వానించినట్లే..

నోటికి రుచిగా ఉంటుందని ఎక్కువ శాతం ప్రజలు ఫాస్ట్‌ఫుడ్‌ని ఇష్టపడుతున్నారు. వాటిలో వివిధ రకాల రసాయనాలు కలిపి చేయడం వల్ల ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధికంగా కడుపునొప్పి, అజీర్తి, పొట్ట పెరగడం, ఎలర్జీ లాంటి వ్యాధులు వస్తాయి. నోటి రుచి అని కాకుండా సహజసిద్ధమైన పండ్లు తీసుకోవాలి.

-డా. శ్రీహరి, ఎంబీబీఎస్‌


ఈ వార్తలు కూడా చదవండి:

సూర్య @ 40 ప్లస్‌

డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్

Read Latest Telangana News and National News

Updated Date - Apr 15 , 2026 | 12:06 PM