లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:39 AM
లష్కర్ బోనాల జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ఉజ్జయినీ మహంకాళి ఆలయంతోపాటు సికింద్రాబాద్లోని పలు అమ్మవారి ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.
అమ్మవారి ఆలయాలు ముస్తాబు
సికింద్రాబాద్: లష్కర్ బోనాల జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ఉజ్జయినీ మహంకాళి ఆలయంతోపాటు సికింద్రాబాద్లోని పలు అమ్మవారి ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఆగస్టు 2, 3 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వర్షాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్లో తాత్కాలిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాతో భద్రతను పర్యవేక్షించనున్నారు. భక్తుల సౌకర్యార్థం 6 క్యూ లైన్లను ఏర్పాటు చేస్తుండగా, ఇందులో రెండు బోనాల క్యూ లైన్లు, రెండు జనరల్ లైన్లు, రెండు వీఐపీ లైన్లు ఉండనున్నాయి. భక్తుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి అధికారులు 5 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మూడు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలను పార్క్ చేయడానికి 8 పార్కింగ్ స్థలాలను కేటాయించారు. హరిహర కళా భవన్ పక్క రోడ్డు, మహబూబ్ కళాశాల స్కూల్, ఓల్డ్ జైల్ ఖానా, మోండా మార్కెట్ వెనుక ఇస్లామియా స్కూల్, అడవయ్య ఎక్స్ రోడ్డు సమీపంలోని ఆదయ్య మెమోరియల్ స్కూల్, ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద, బెల్సన్ తాజ్ హోటల్ వద్ద, తాజ్ త్రీస్టార్ హోటల్ వద్ద వాహనాలను పార్కింగ్ చేయవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News