నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ
ABN , Publish Date - May 13 , 2026 | 04:24 PM
వైసీపీ హయాంలో తనపై నమోదైన కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఈ కేసుపై తాను పట్టువదలని విక్రమార్కుడిలా న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యానించారు.
పశ్చిమగోదావరి జిల్లా మే 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో తనపై నమోదైన కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Raghu rama Krishnam Raju) స్పష్టం చేశారు. ఈ కేసుపై తాను పట్టువదలని విక్రమార్కుడిలా న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) పశ్చిమగోదావరి జిల్లాలో రఘురామ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు (గురువారం) తన పుట్టినరోజు అని.. తన కేసు రేపటికి ఐదేళ్లు అవుతుందని తెలిపారు. తన కేసులో మూడో ముద్దాయిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని ప్రస్తావించారు.
శరవేగంగా పోలవరం పనులు..
మొదటి ముద్దాయి విచారణకు రాయల్గా వచ్చి రాయల్గా వెళ్లిపోయారని రఘురామ విమర్శించారు. రెండో ముద్దాయిని, మూడో ముద్దాయిని ఇంకా విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఈ కేసులో జగన్ రెడ్డి, సునీల్ కుమార్ పేర్లు ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తోందని తెలిపారు. 2027 జూన్లో పోలవరం పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు. పోలవరంతో పాటు తన కస్టోడియల్ టార్చర్ కేసును కూడా పూర్తి చేస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చారు.
మహాసేన రాజేశ్తో మాట్లాడుతా..
తనపై మహాసేన రాజేశ్ పెట్టిన పోస్టును చూశానని తెలిపారు. జగన్ రెడ్డిని ఇప్పటివరకు తాను ఎందుకు ప్రశ్నించలేదని రాజేశ్ అడిగారని చెప్పారు. ఈ విషయంపై ఆయనతో మాట్లాడతానని అన్నారు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఆయన చేసిన దారుణాల గురించి తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. రచ్చబండ ద్వారా జగన్ రెడ్డిని ఓడించే వరకు మాట్లాడానని తెలిపారు. ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారని విమర్శించారు. ఇంకా జగన్ గురించి తాను మాట్లాడేది ఏముందని రఘురామ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్.. పెదపాడుకు కొత్త స్కూల్ భవనం
అగ్నిమాపక శాఖలో ఖాళీల భర్తీకి హోంమంత్రి ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News