విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పవన్, లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
ABN , Publish Date - Jun 08 , 2026 | 09:37 PM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతిచెందటంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు.
అమరావతి, జూన్8 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతిచెందటంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు. ఈరోజు (సోమవారం) సచివాలయంలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రేపు (మంగళవారం) విశాఖ చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని తెలిపారు.
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. స్టీల్ ప్లాంట్లో చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీశానని అన్నారు. అధికారులంతా సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు.
ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది: మంత్రి లోకేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో కార్మికులు మృతిచెందటంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు. ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులకు వైద్యం, ప్రమాద స్థలంలో సహాయకచర్యలను పర్యవేక్షిస్తోందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest And Telangana News And National News
And Telugu News