కావూరి సాంబశివరావు మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం
ABN , Publish Date - Mar 11 , 2026 | 01:07 PM
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటుగా పలువురు నేతలు పేర్కొన్నారు.
అమరావతి, హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) (Kavuri Sambasiva Rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కావూరి సాంబశివరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కావూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటుగా పలువురు నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్, పలువురు నేతలు కావూరి సాంబశివరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర: సీఎం చంద్రబాబు
కావూరి సాంబశివరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి అత్యంత బాధాకరమని తెలిపారు. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరని లోటని పేర్కొన్నారు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర అని కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.
కావూరి.. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారు: కిషన్రెడ్డి
కావూరి సాంబశివరావు మృతి పట్ల కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి (Kishan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఐదుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా వారు ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. రాజకీయంలో వారికున్న సుదీర్ఘ అనుభవంతో.. ప్రజాసమస్యలపై పార్లమెంటు లోపలా, బయటా తన గళాన్ని వినిపించారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రగతి కోసం కావూరి ఎనలేని కృషి చేశారు: మంత్రి నారా లోకేశ్
కావూరి సాంబశివరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీమంత్రి, రాజకీయ కురువృద్ధులు, మా బంధువు కావూరి సాంబశివరావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తన నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. కావూరి సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
కావూరి.. ప్రజాసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు: శ్రీనివాస వర్మ
కావూరి సాంబశివరావు మరణం పట్ల కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధీశాలి కావూరి అని కొనియాడారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై నిరంతరం గళం వినిపించిన గొప్ప నాయకుడు కావూరి అని ప్రశంసించారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా బీజేపీ కుటుంబానికి తీరని లోటని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
కావూరి మరణం అత్యంత బాధాకరం: పనబాక లక్ష్మి
కావూరి సాంబశివరావు మృతికి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి (Panabaka Lakshmi) సంతాపం వ్యక్తం చేశారు. కావూరి మరణం అత్యంత బాధాకరమని అన్నారు. కావూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పనబాక లక్ష్మి పేర్కొన్నారు.
రాజకీయ, వ్యాపార రంగాల్లో కావూరిది ప్రత్యేక ముద్ర: లగడపాటి రాజగోపాల్
కావూరి సాంబశివరావు మృతి పట్ల మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. రాజకీయ, వ్యాపార రంగాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడు కావూరి అని కొనియాడారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచిన నిబద్ధత గల నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని లగడపాటి రాజగోపాల్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం
జగన్ హయాంలో ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారు.. మంత్రి నారాయణ ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News