సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన బాబా రామ్దేవ్
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:15 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
విజయవాడ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యోగాంధ్ర లోగోతో కూడిన ప్రత్యేక టీ షర్ట్ని సీఎం ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాది మంది యోగా సాధకులతో కలిసి ముఖ్యమంత్రి యోగా అభ్యాసం చేశారు.
ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనులోమ - విలోమ పద్ధతిలో ప్రాణాయామం చేశారు. రామ్దేవ్ బాబా స్వయంగా సీఎంతో ప్రాణాయామ సాధన చేయించడంతో ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వేదికపై రామ్దేవ్ బాబా శిష్యులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి యోగా సాధకులను ఆకట్టుకున్నారు. యోగ సాధన వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించడంతో పాటు, నిత్యజీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని రామ్దేవ్ బాబా సూచించారు.
ఈ కార్యక్రమం ప్రారంభంలో వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణ మధ్య ఈ స్టేడియం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు యోగా సాధన చేసి ఆరోగ్యకర జీవనశైలికి యోగా ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా పాల్గొని యోగా సాధన చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేలా సాగింది.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని చాలా బాగా అభివృద్ధి చేశారు.. సీఎం చంద్రబాబుపై బాబా రామ్దేవ్ ప్రశంసలు
నేను హోం మంత్రిని కాదు... అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కల్యాణ్
25 కోట్ల మందిని పేదరికం నుంచి మోదీ సర్కార్ బయటకు తీసుకొచ్చింది: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News