నేను హోం మంత్రిని కాదు... అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 20 , 2026 | 09:43 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ రాజ్యాంగ పదవుల్లో కూర్చుని జీవితాలను శాసిస్తామంటే కుదరదని హెచ్చరించారు.
కాకినాడ, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ రాజ్యాంగ పదవుల్లో కూర్చుని జీవితాలను శాసిస్తామంటే కుదరదని హెచ్చరించారు. తిరగబడటానికి జీవితకాలం తాము సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈరోజు (శనివారం) కాకినాడలో మాటామంతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రిమినల్స్ను తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంటే తలరాతలను ఎవరూ బాగుచేయలేరని చెప్పుకొచ్చారు. వైసీపీ బలమే కులం, క్రిమినల్స్ అని ఎద్దేవా చేశారు.
క్రిమినల్స్ పాలకులు కాకూడదు..
క్రిమినల్స్ పాలకులు కాకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ అధికారంలో లేకున్నా ఆ పార్టీ నేతలు క్రిమినల్స్గా బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ గూండాలను ఇక నుంచి తొక్కి నారతీస్తామని హెచ్చరించారు. తాను హోంమంత్రిని కాదని... అది క్రిమినల్స్ అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈ రెండేళ్లు సహనం పట్టా శాంతంగా ఉన్నానని స్పష్టం చేశారు. హోంమంత్రిని తిట్టిన వైసీపీ నేతలను చూసి రేపు ఇంకో ఆడబిడ్డను అంటారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు తన చేతుల్లో లేవని తెలిపారు. తనను కులానికి పరిమితం చేయొద్దని.. ఏం జరిగినా తనను కులాల్లోకి లాగుతున్నారని ఫైర్ అయ్యారు.
కులాల దరిద్రం పోకపోతే ఏపీ బాగుపడదు..
వైసీపీ నేత అనంత బాబు తన డ్రైవర్ని చంపితే ఆయన కులం గురించి ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కులాల దరిద్రం పోకపోతే ఏపీ బాగుపడదని తెలిపారు. వైసీపీకి శవాలు లేస్తేగానీ సంతోషం రాదని వ్యంగ్యంగా అన్నారు. ఈ మూడేళ్లలో వైసీపీకి తన యాక్షన్ చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ తనది కాదని ఇక కూర్చోనని తన అభిప్రాయం సీఎంకు కూడా చెప్పకుండా నేరుగా ప్రజలకే చెబుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉండాలి..
లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉండాలని పవన్ కల్యాణ్ తెలిపారు. జగన్ హయాంలో సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఆధారాలు లేకపోతే ఎవరినీ ఏమీ చేయలేమని చెప్పుకొచ్చారు. క్రిమినల్స్ పాలకులుగా ఉండకూడదని చెప్పారు. క్రిమినల్స్ను కులం కోణంలో చూడకూడదని చెప్పారు. క్రిమినల్స్ను వెనకేసుకొచ్చే నేతలను పక్కనపెట్టాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఈగల్ వ్యవస్థతో డ్రగ్స్కు చెక్ పెట్టాం: హోం మంత్రి అనిత
మహిళలను కించపరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. వైసీపీకి మంత్రి ఆనం వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News