హరియాణలో గుడివాడ టెకీ దారుణ హత్య.. ఉద్యోగంలో చేరిన 10 రోజులకే..
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:40 PM
కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర విషాదం నెలకొంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతాడనుకున్న యువకుడు ఉద్యోగంలో చేరిన పది రోజులకే హరియాణలో విగతజీవిగా పడి ఉండటం స్థానికులను కలచివేస్తోంది.
కృష్ణా జిల్లా, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర విషాదం నెలకొంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతాడనుకున్న యువకుడు ఉద్యోగంలో చేరిన పది రోజులకే హరియాణలో విగతజీవిగా పడి ఉండటం స్థానికులను కలచివేస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హరియాణ రాష్ట్రంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి కోసం వెళ్లిన చోటే రక్తపు మడుగులో శవమై కనిపించడంతో బాధితుడి స్వగ్రామం బేతవోలులో విషాద ఛాయలు అలముకున్నాయి.
గుడివాడలోని బేతవోలు ప్రాంతానికి చెందిన బండ్ల రుషికేశ్ (27) ప్రతిభావంతుడైన యువకుడు. ఇటీవల ఆయన హరియాణలోని పంచకులలో ఉన్న ‘వేది టెక్నాలజీస్’ (Vedi Technologies) అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం సంపాదించారు. కేవలం పది రోజుల క్రితమే రుషికేశ్ హరియాణకు వెళ్లి విధుల్లో చేరారు. కొత్త ఉద్యోగం, కొత్త పరిసరాల్లో తన భవిష్యత్తును వెతుక్కునే పనిలో ఉన్నారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం కంపెనీకి చెందిన రూమ్ (వసతి గృహం)లో రుషికేశ్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని సహోద్యోగులు గమనించారు. ఆ కంపెనీ నిర్వాహకులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులకు సమాచారం
హరియాణ పోలీసులు అందించిన సమాచారం మేరకు, గుడివాడ వన్టౌన్ పోలీసులు బేతవోలులోని రుషికేశ్ కుటుంబ సభ్యులకు ఈ వార్తను చేరవేశారు. తన కుమారుడు చాలా మంచివాడని, ఎవరితోనూ గొడవలు పడే వ్యక్తి కాదని చెబుతూ రుషికేశ్ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఉన్నత చదువులు చదివి తమను ఆదుకుంటాడనుకున్న కొడుకు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని కుంగదీసిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన హరియాణకు బయలుదేరారు.
పోలీసుల దర్యాప్తు..
ఈ కేసులో హరియాణ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రుషికేశ్ను ఎవరు ఎందుకు చంపాల్సి వచ్చింది?, సహోద్యోగులతో ఏవైనా గొడవలు ఉన్నాయా..? లేదా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా.? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దోపిడీ దొంగలు ఎవరైనా చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్నది కూడా విచారణలో తేలాల్సి ఉంది. రుషికేశ్ చివరిగా ఎవరితో మాట్లాడారు..? రూమ్లోకి ఎవరెవరు వచ్చారు..? అనే అంశాలను సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న యువత భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రుషికేశ్ మృతికి కారణమైన దోషులను వెంటనే పట్టుకోవాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు
పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా జగన్ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న
Read Latest AP News And Telangana News And International News And Telugu News