సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ బాటలోనే మంత్రులు
ABN , Publish Date - May 14 , 2026 | 09:53 AM
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ఏపీ మంత్రులు పొదుపు చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తరహాలోనే మంత్రులు కాన్వాయ్ని కుదించుకుంటున్నారు.
అమరావతి, మే 14: అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన పొదుపు చర్యలను ఏపీ మంత్రులు పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తరహాలోనే మంత్రులు కాన్వాయ్ను కుదించుకుంటున్నారు. ఈరోజు(గురువారం) ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎస్కార్ట్ వాహనం లేకుండా విందుకు వచ్చారు.
అలాగే మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్ తదితరులు.. ఎస్కార్ట్ కాకుండా ఒక్కో వాహనంలోనే సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మంత్రి నారాయణ కూడా కాన్వాయ్ను కుదించుకున్నారు. గతంలో మంత్రి నారాయణ కారుతో పాటు కాన్వాయ్లో మరో నాలుగు వాహనాలు ఉండేవి. ప్రస్తుతం వాహన శ్రేణిలోని రెండు వాహనాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి మంత్రి నారాయణ కాన్వాయ్ 50 శాతం తగ్గగా.. కేవలం రెండు వాహనాలతోనే సీఎం క్యాంపు ఆఫీసుకు మంత్రి చేరుకున్నారు.
ఎన్ఎస్జీ కోసం ప్రత్యేక బస్సు..
సీఎం చంద్రబాబు వాహనశ్రేణిని తొమ్మిది వాహనాల నుంచి నాలుగుకు కుదించారు. సీఎం వాహనాలు 50 శాతం కుదించడంతో ఆయన భద్రత చూసే ఎన్ఎస్జీ కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఇకపై ఎన్ఎస్జీ సెక్యూరిటీ.. సీఎం కాన్వాయ్లో బస్సులోనే వెనుక వెళ్లనుంది. మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్ సగానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఆర్పీఎఫ్ భద్రత ఉండటంతో లోకేశ్ కాన్వాయ్లో మొత్తం నాలుగు వాహనాలు ఉండగా... వాహనాలు కుదించడంతో ఇక కాన్వాయ్లో రెండు వాహనాలు ఉండనున్నాయి. దీన్ని నేటి నుంచే అమలు చేయాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్.. పెరిగిన చిక్కుడు, బీరకాయ.. తగ్గిన దోస, వంకాయ
Read Latest AP News And Telugu News