ఆర్థిక లెక్కలపై సీఎం చంద్రబాబు అసహనం
ABN , Publish Date - Feb 06 , 2026 | 02:00 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని, రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు.
కర్నూలు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని, రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రైతుల్లో హర్షాతిరేకాలను కలిగించింది.
ప్రభుత్వ స్టాళ్ల పరిశీలన..
గ్రామసభా ప్రాంగణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైతులు, గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూ హక్కులు, భూ రికార్డుల తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆర్థిక లెక్కలపై అసహనం..
ఈ సందర్భంగా జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయి ఆర్థిక లెక్కలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ‘తలసరి ఆదాయం వివరాలన్నీ ముందుగానే నేను చదువుకొని వచ్చాను’ అని పేర్కొంటూ, కాకి లెక్కలు కాకుండా కరెక్ట్ డేటా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిరికి సీఎం చంద్రబాబు స్పష్టంగా సూచించారు. అధికారులు సమగ్ర అవగాహనతో, బాధ్యతగా సమాచారం ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఆర్థిక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సరైన డేటా, స్పష్టమైన విశ్లేషణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
బుడగ జంగాలపై కీలక ప్రకటన
బుడగ జంగాల అంశంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించానని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఎస్సీలకు రిజర్వేషన్లు మినహా అందే అన్ని ప్రయోజనాలు బుడగ జంగాలకూ అందేలా నిన్ననే సంతకం చేశానని వెల్లడించారు. బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చేంత వరకు వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రైతులకు భరోసా..
‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం ద్వారా రైతుల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. భూ రికార్డులు స్పష్టంగా ఉంటే రైతులకు భద్రత, ఆర్థిక స్థిరత్వం వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..
Read Latest Telangana News And AP News And Telugu News